సెలబ్రిటీలు అంటే వారికి ఎటువంటి కష్టాలు, బాధలు ఉండవని చాలా మంది అభిప్రాయం. కానీ సామాన్యుల మాదిరిగానే సెలబ్రిటీలు కూడా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. అయితే కొందరు వాటిని బయటపెట్టేందుకు ఇష్టపడరు. మరికొందరు తమకున్న అనారోగ్య సమస్యలను రివీల్ చేసి ఇతరులకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తుంటారు. తాజాగా ఈ జాబితాలో సీనియర్ నటి, మణిరత్నం సతీమణి సుహాసిని కూడా చేరారు. 80, 90 దశకాల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సుహాసిని.. ప్రస్తుతం సహాయక నటిగా సత్తా చాటుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుహాసిని తనకున్న జబ్బు గురించి బయటపెట్టారు. సుహాసిని మాట్లాడుతూ.. `నాకు టీబీ వ్యాధి ఉంది. కానీ ఈ విషయాన్ని నేను సీక్రెట్ గా ఉంచాను. టీబీ ఉందన్న విషయం తెలిస్తే పరువు పోతుందని భయపడ్డాను. అందుకే ఎవరికీ తెలియకుండా ఆరు నెలల చికిత్స తీసుకున్నాను. అయితే ఈ విషయాన్ని దాచాల్సిన అవసరం లేదనిపించింది. టీబీ వ్యాధిపై సమాజానికి అవగాహన కల్పించాలని నేను భావిస్తున్నాను` అంటూ చెప్పుకొచ్చారు. కాగా, తమిళనాడుకు చెందిన సుహాసినికి ఆరేళ్ల వయసులోనే టీబీ వ్యాధి సోకిందట. కొన్నాళ్లు చికిత్స అనంతరం ఆమె కోలుకున్నారు. కానీ 36 ఏళ్ల వయసులో జబ్బు మళ్లీ తిరగబెట్టడంతో.. ఒక్కసారిగా బరువు తగ్గిపోవడం, వినికిడి సమస్యలను సుహాసిని ఫేస్ చేశారట. ట్రీట్మెంట్ తీసుకోవడంతో క్రమంగా ఆమె టీబీ వ్యాధి నుంచి బయటపడ్డారని తెలుస్తోంది. ఇకపోతే కెరీర్ పీక్స్ లో ఉన్న టైమ్లోనే సుహాసిని డైరెక్టర్ మణిరత్నంను ప్రేమించి పెళ్లాడారు. ఈ దంపతులకు నందన్ అనే కుమారుడు కూడా ఉన్నారు.