రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో పాలనపై సీఎం చంద్రబాబు అనేక సందర్భాల్లో వివరించారు. ఇటీవలే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని కూడా నిర్వహిం చారు. ఏ వేదికెక్కినా ఆయన కూటమి సర్కారు ఏం చేసిందో.. ఎలా ఉందో చెబుతున్నారు. ఇలానే తాజాగా విజయవాడలో జరిగిన భారత వాణిజ్య సమాఖ్య(ఫిక్కీ) సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్ల పాలన గురించి ఆలోచించవద్దని, మళ్లీ అటువంటి పరిస్థితి రాదని తాను హామీ ఇస్తున్నానని పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు అన్నారు. అయితే, తాను తీర్చిదిద్దిన బ్రాండ్ ఏపీని గత ప్రభుత్వం ధ్వంసం చేసిందని, కానీ, బ్రాండ్ ఏపీకి బ్రాండ్ సీబీఎన్ గా తాను హామీ ఇస్తున్నానని అన్నారు.
ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వం ఎలా ఏర్పడింది? ఏ లక్ష్యంతో పనిచేస్తోంది? ప్రజల సంతృప్తి ఎలా ఉంది? ఇలా.. అనేక విషయాలను ప్రస్తావించారు. దీంతో పాటు పరిశ్రమలకు తాము ఇస్తున్న ప్రాధా న్యం కూడా వివరించారు. పారిశ్రామిక రంగానికి ఇస్తున్న ప్రధాన్యాన్ని ఆయన వివరించారు. ప్రత్యేకంగా పోలీసు నుంచి భద్రత, శాంతి భద్రతల అంశాలను వివరించారు. ఈ క్రమంలో ఆయన అనూహ్యమైన పనిచేశారు.
రాత్రి వేళల్లో సహజంగానే పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తారు. జీపులు, ద్విచక్ర వాహనాల్లో పోలీసులు అర్ధరాత్రి వేళ తిరుగుతూ.. శాంతి భద్రతను పర్యవేక్షిస్తూ ఉంటారు. అయితే.. కూటమి సర్కారు వచ్చిన తర్వాత దీనిలో కీలక మార్పులు చేశారు. ఇప్పుడు విజయవాడ, విశాఖ, తిరుపతి వంటి కీలక నగరాల్లో డ్రోన్ ఆధారిత పెట్రోలింగ్ చేస్తున్నారు. ఈ విషయాన్నే చంద్రబాబు ప్రస్తావిస్తూ.. సదరు డ్రోన్లను పరిశ్రమ వర్గాలకు చూపించారు.