బాలయ్య ఫ్యాన్స్‌కు బిగ్ షాక్‌.. `అఖండ 2` రిలీజ్‌కు కోర్టు బ్రేక్‌!

admin
Published by Admin — December 04, 2025 in Movies
News Image

న‌ట‌సింహం నంద‌మూరి బాలకృష్ణ తాజా సినిమా ‘అఖండ 2 – తాండవం’ కోసం ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో చెప్పనక్కర్లేదు. పెయిడ్‌ ప్రీమియర్లకు హౌస్‌ఫుల్‌ బోర్డులు, థియేటర్ల వద్ద పూజలు, సోషల్‌ మీడియాలో అప్‌డేట్లతో బాలయ్య అభిమానులు సెలబ్రేషన్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. కానీ.. రిలీజ్‌కు కొన్ని గంటల ముందే వచ్చిన కోర్టు తీర్పు ఈ ఉత్సాహానికి గట్టి బ్రేక్ వేసింది.

బాలీవుడ్‌కు చెందిన ఖ్యాతి గాంచిన నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్.. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నుంచి తమకు రూ. 28 కోట్ల బకాయి ఉందని, ఆ మొత్తం చెల్లించే వరకు అఖండ 2 రిలీజ్‌ను నిలిపివేయాలని కోర్టును ఆశ్రయించింది. ఈరోస్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ పూర్తి చేసిన మద్రాస్ హైకోర్టు ఈ సినిమాపై మధ్యంతర స్టే విధించింది. దీంతో విడుదలకు రెడీగా ఉన్న డిస్ట్రిబ్యూటర్లు, అభిమానులు ఒక్కసారిగా షాక్‌లో పడిపోయారు.

గతంలో మహేశ్ బాబు సినిమాలు ‘1–నేనొక్కడినే’, ‘ఆగడు’ నిర్మాణ సమయంలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఈరోస్‌ సంస్థ పని చేసింది. ఆ సినిమాల ఏర్పడిన భారీ నష్టాలకు సంబంధించిన ఆర్థిక వివాదమే ప్రస్తుత స్టేకు కారణమైంది. అదే భాగస్వాములు అయిన రామ్ ఆచంట – గోపి ఆచంట ఇప్పుడు 14 రీల్స్ ప్లస్ పేరుతో అఖండ 2 నిర్మించినందున, పాత బకాయిల బాధ్యత కూడా వారిదేనని ఈరోస్‌ సంస్థ వాదించింది. ఈ వాదనతో ఏకీభవించిన కోర్టు, సినిమాపై తాత్కాలిక స్టే విధించింది.

ఖచ్చితంగా ఇవాళే పెయిడ్ ప్రీమియర్ల ద్వారా విడుదల చేయాలని ప్లాన్ చేసిన నిర్మాతలపై ఈ తీర్పు పిడుగులా పడింది. ఇప్పటికే బుక్ అయిన షోలు, చేసిన ప్రమోషన్లు అన్నీ ఒక్కసారిగా నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. అయితే ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ వివాదం పూర్తిగా ఆర్థిక సెటిల్‌మెంట్‌తో ముగిసే అవకాశం ఉంది. రెండు సంస్థల ప్రతినిధులు ఇప్పటికే చర్చలకు సిద్ధంగా ఉన్నారని, ఫ్యాన్స్ ఆందోళన పడాల్సిన పనిలేదని భావిస్తున్నారు. కోర్టు బయట క్విక్ సెటిల్‌మెంట్ జరిగితే సినిమా అనుకున్న టైమ్‌కి థియేటర్లలోకి రావచ్చని టాక్.

Tags
Akhanda 2 Balakrishna NBK Eros International 14 Reels Plus Akhanda 2 release
Recent Comments
Leave a Comment

Related News