వైకాపా నాయకుడు, రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ ఏకంగా హైకోర్టుకే టోకరా వేశాడు. తల్లికి అనారోగ్యం అంటూ తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లు సబ్మిట్ చేసి బోరుగడ్డ బెయిల్ తెచ్చుకున్న విషయం తాజాగా బయటకు వచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు వారి కుటుంబ సభ్యులపై అసభ్య దూషణలు చేసిన కేసులో బోరుగడ్డ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డకు మరో నెలలో ఏదో విధంగా బెయిల్ వచ్చేది.
కానీ ఇంతలోనే బోరుగడ్డ తన అత్యుత్సాహం ప్రదర్శించి అడ్డంగా ఇరుక్కున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లి పద్మావతిని చూసేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ బోరుగడ్డ అనిల్ కుమార్ గత నెల 14న హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు అదే నెల 15 నుంచి 28 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మీడియాకు చిన్న లీక్ కూడా ఇవ్వకుండా సైలెంట్ బయటకు వచ్చిన బోరుగడ్డ.. మధ్యంతర బెయిలు గడువు ముగిసిన వెంటనే సూపరింటెండెంట్ వద్ద లొంగిపోవడమే కాకుండా మార్చి 1వ తేదీన హైకోర్టులో మరో పిటిషన్ వేశాడు.
తన తల్లి ప్రస్తుతం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, ఆమెను తాను ఒక్కడినే కొడుకునని, ఆమెను చూసుకోవడానికి మధ్యంతర బెయిలు పొడిగించాలని విజ్ఞప్తి చేశాడు. పైగా గుంటూరులోని లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ పీవీ రాఘవశర్మ ఇచ్చినట్టుగా ఓ మెడికల్ సర్టిఫికెట్ను కూడా కోర్టులో సబ్మిట్ చేశారు. అయితే మిడికల్ సర్టిఫికెట్ పై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
దాంతో బోరుగడ్డ సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్లోని వాస్తవికతను నిగ్గు తేల్చేందుకు పోలీసులకు అనుమతినిచ్చింది. అలాగే మార్చి 11 వరకు బోరుగడ్డకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఇక కోర్టు అనుమతితో రంగంలోకి దిగిన పోలీసులు.. బోరుగడ్డ మోసాన్ని బయటకు లాగారు. బోరుగడ్డ తల్లి పద్మావతి చెన్నై ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందడం వాస్తవమే అయినప్పటికీ.. ఫిబ్రవరిలోనే ఆమె డిశ్చార్జ్ అయ్యారని పోలీసులు తెలుసుకున్నారు. ఆ వెంటనే గుంటూరులోని లలిత ఆసుపత్రి వైద్యులను సంప్రదించగా.. అసలు పద్మావతి తమ వద్ద చికిత్స తీసుకోలేదని, ఆమెకు సంబంధించి తాము ఎటువంటి మెడికల్ సర్టిఫికెట్ ఇవ్వలేదని ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ పీవీ రాఘవశర్మ పేర్కొన్నారు. దీంతో బోరుగడ్డ సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్ నకిలీదని తేలిపోయింది. కోర్టుకే టోకరా వేసిన అనిల్ కోసం ప్రస్తుతం అనంతపురం, గుంటూరు జిల్లా పోలీసులు గాలిస్తున్నారు.