నటిగా, సింగర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మమతా మోహన్ దాస్, తెరపై ఎంత ధైర్యంగా కనిపిస్తారో.. నిజ జీవితంలో అంతకంటే ఎక్కువ పోరాటాలే చేశారు. ప్రాణాంతకమైన క్యాన్సర్ను జయించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ఆమె, తాజాగా సుహాసిని మణిరత్నం నిర్వహించిన పాడ్కాస్ట్లో తన జీవితంలోని అత్యంత చీకటి కోణాన్ని బయటపెట్టారు. ముఖ్యంగా ఒక స్టార్ నటుడు తనను ప్రేమ పేరుతో ఎలా వెన్నుపోటు పొడిచాడో చెబుతూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
మమత తన కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే క్యాన్సర్ బారిన పడ్డారు. ఆ క్లిష్ట సమయంలోనే ఒక ప్రముఖ మలయాళ నటుడితో ఆమె ప్రేమలో ఉన్నారు. అనారోగ్యంతో పోరాడుతున్న తనకు తోడుగా ఉంటాడనుకున్న ఆ వ్యక్తి, అసలు రంగును బయటపెట్టాడు. అతడికి అప్పటికే వేరే అమ్మాయితో నిశ్చితార్థం జరిగిందనే నిజాన్ని దాచిపెట్టి, మమతతో ప్రేమ నాటకం ఆడాడు. ఆ మోసం తెలిసినప్పుడు తను అనుభవించిన నరకం క్యాన్సర్ బాధ కంటే ఎక్కువని మమత ఎమోషనల్ అయ్యారు.
ఆరు నెలలకే ముగిసిన పెళ్లి బంధం..
కేవలం ప్రేమలో మోసం మాత్రమే కాదు, తన వైవాహిక జీవితంలో ఎదురైన ఒడిదుడుకులపై కూడా మమత స్పందించారు. 2011లో తన చిన్ననాటి స్నేహితుడు ప్రజిత్ పద్మనాభన్ను పెళ్లి చేసుకున్న మమత.. మనస్పర్థల కారణంగా కేవలం ఆరు నెలలకే విడిపోయారు. 2012లో అధికారికంగా విడాకులు తీసుకున్న ఆమె, ఆ చేదు జ్ఞాపకాల నుండి బయటపడటానికి చాలా సమయం పట్టిందని చెప్పుకొచ్చారు. అయితే గతాన్ని మర్చిపోయి మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి రెడీగా ఉన్నానని.. సరైన వ్యక్తి దొరికితే మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదని మమత మనసులోని మాటను బయటపెట్టారు. కాగా, కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం మమత మలయాళంతో పాటు పలు భాషల్లో సినిమాలు చేస్తూ నటిగా బిజీ లైఫ్ను లీడ్ చేస్తోంది.