‘కోర్టు’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి.. వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నారు సీనియర్ నటుడు శివాజీ. డిసెంబరులో వచ్చిన శివాజీ చివరి చిత్రం ‘దండోరా’లోనూ ఆయన పెర్ఫామెన్స్ ప్రశంసలు అందుకుంది. ఇప్పుడాయన లీడ్ రోల్ చేసిన ‘సంప్రదాయినీ సుప్పినీ శుద్ధపూసనీ’ మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రెండు నెలల కిందటి వివాదం గురించి మాట్లాడాడు శివాజీ.
‘దండోరా’ ప్రి రిలీజ్ ఈవెంట్లో మహిళల వస్త్రధారణ గురించి శివాజీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. చెప్పాలనుకున్న విషయం కంటే.. ఆయన వాడిన కొన్ని బూతు మాటలు ఎక్కువ విమర్శలకు దారి తీశాయి. ఈ వివాదం కారణంగా తాను మూడు రోజుల పాటు నిద్రపోలేదని శివాజీ చెప్పారు. తన నోటి నుంచి ఆ మాటలు ఎలా వచ్చాయో అర్థం కాక మనో వేదనకు గురైనట్లు ఆయన తెలిపాడు.
తన ఉద్దేశం ఏంటో సమాజానికి తెలుసని.. ప్రజలు కూడా అర్థం చేసుకున్నారని శివాజీ చెప్పాడు. తాను కొన్ని వందల ప్రెస్ మీట్లు, డిబేట్లలో మాట్లాడానని.. ఎన్నడూ నోరు జారలేదని.. ఆ రోజు మాత్రం తన నోటి నుంచి ఆ పదాలు ఎలా వచ్చాయో తెలియలేదని.. ఈ విషయంలోనే మానసిక సంఘర్షణకు గురై తాను మూడు రోజులు నిద్ర పోలేదని చెప్పాడు శివాజీ. ఈ వ్యవహారంలో తనను అత్యంత బాధ పెట్టిన విషయం.. తనకు బాగా తెలిసిన వాళ్లే తన మీద మహిళా కమిషన్లో ఫిర్యాదు చేయడమని శివాజీ వెల్లడించాడు.
వాళ్ల పేర్లు తాను చెప్పనని.. ఇప్పటికీ వాళ్లంటే తనకు గౌరవం ఉందని శివాజీ అన్నాడు. అనసూయను తాను ఏమీ అనలేదని.. ఆమెతో తనకు పెద్దగా పరిచయం లేదని.. ఒకసారి తనను ఆమె ఇంటర్వ్యూ చేసిందని శివాజీ గుర్తు చేసుకున్నాడు. అనసూయ అన్నా కూడా తనకు గౌరవం ఉందని.. ఈ ప్రపంచంలో ఉద్దేశపూర్వకంగా మహిళలను కించపరచాలని మగవాళ్లు అనుకోరన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని శివాజీ చెప్పాడు.