వైసీపీ(YCP) అంతర్గత రాజకీయాల్లో ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీలో నెలకొన్న నైరాశ్యం, ఓటమికి గల కారణాలపై జరుగుతున్న విశ్లేషణలు ఇప్పుడు వేళ్లను ఒకరివైపే చూపిస్తున్నాయి. ఆయనే పార్టీలో ఇన్నాళ్లూ సర్వస్వమై నడిపించిన సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల ఇచ్చిన తప్పుడు సలహాలు, గ్రౌండ్ రియాలిటీకి దూరంగా సాగిన ఆయన వ్యూహాలే జగన్ను ప్రజలకు దూరం చేశాయని పార్టీలోని ఒక బలమైన వర్గం ఇప్పుడు గొంతు విప్పుతోంది. ఈ అసంతృప్తి సెగలు తాడేపల్లి కోటను దాటి జగన్ దాకా చేరడంతో, ఇప్పుడు పార్టీలో పాత తరం నేతలకు మళ్లీ ప్రాధాన్యత పెరుగుతోందనే చర్చ మొదలైంది.
ముఖ్యంగా విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు జగన్కు అత్యంత సన్నిహితుడిగా, పార్టీకి వెన్నెముకలా ఉన్న సాయిరెడ్డి, గత కొన్నాళ్లుగా కోటరీ దెబ్బకు సైడ్ అయిపోయారన్నది బహిరంగ రహస్యం. రాజ్యసభకు రాజీనామా చేసిన తర్వాత ఆయన అకస్మాత్తుగా రైతన్న అవతారం ఎత్తడం వెనుక పెద్ద రాజకీయ స్కెచ్చే ఉందన్నది విశ్లేషకుల అభిప్రాయం. పొలాల్లో పురుగు మందు పిచికారీ చేస్తూ, ఎరువులు చల్లుతూ ఆయన విడుదల చేస్తున్న వీడియోలు కేవలం సోషల్ మీడియా పబ్లిసిటీ కోసం మాత్రమే కాదు.. తాను సామాన్య ప్రజలకు, రైతులకు దగ్గరగా ఉన్నాననే సంకేతాన్ని జగన్ రెడ్డికి పంపడమే ఆయన అసలు వ్యూహం.
అంతేకాకుండా, గతంలో అమరావతి రైతుల పట్ల కఠినంగా వ్యవహరించారనే ముద్ర ఉన్న సాయిరెడ్డి, ఇప్పుడు వ్యూహాత్మక మౌనం పాటిస్తూనే వారి పట్ల సానుభూతి కురిపిస్తున్నట్లుగా నటిస్తున్నారు. ఇది భవిష్యత్తులో పార్టీని అన్ని వర్గాలకు దగ్గర చేసే ప్రయత్నంలో భాగమే అని తెలుస్తోంది. సజ్జల మార్క్ రాజకీయాలు విఫలమైన చోట, తన మార్క్ దౌత్యం, మేనేజ్మెంట్ స్కిల్స్ పార్టీకి అవసరమని ఆయన పరోక్షంగా నిరూపించుకుంటున్నారు. జగన్ కూడా ఇటీవల సజ్జల(Sajjala) నిర్ణయాలను పక్కన పెట్టి, పార్టీ పునాదుల నుంచి ఉన్న నేతల అభిప్రాయాలకు విలువ ఇస్తున్నట్లుగా సంకేతాలు వస్తున్నాయి.
రాబోయే ఆరు నెలల కాలం వైసీపీ భవిష్యత్తుకు అత్యంత కీలకం కానుంది. సజ్జల స్థానాన్ని భర్తీ చేసే సమర్థుడు విజయసాయిరెడ్డేనని పార్టీలోని కేడర్ గట్టిగా నమ్ముతోంది. అందుకే ఆయన మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతూ, జగన్ వాదనను గట్టిగా వినిపిస్తున్నారు. పార్టీ మళ్లీ పూర్వవైభవం సంపాదించాలంటే పాత మిత్రుల కలయిక అనివార్యమని భావిస్తున్న జగన్(Jagan), త్వరలోనే సాయిరెడ్డికి పార్టీ పగ్గాల్లో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. మొత్తానికి వైసీపీలో రివర్స్ గేర్ పడిందని, సజ్జల పర్వం ముగిసి సాయిరెడ్డి శకం మళ్లీ మొదలవుతోందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.