కూటమి ప్రభుత్వంలో క్రమశిక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) మరోసారి స్పష్టం చేశారు. పార్టీ గౌరవానికి భంగం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకుంటానని సొంత పార్టీ నేతలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు వ్యవహారశైలిపై సీఎం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
అసలు విషయం ఏమిటంటే.. జిల్లా పోలీస్ సెల్ న్యాయ సలహాదారు నియామకం విషయంలో ఎమ్మెల్యే అరవిందబాబు(MLA Aravinda Babu) పంతానికి పోయారు. తాను సిఫారసు చేసిన వ్యక్తికి పోస్టింగ్ ఇవ్వలేదన్న నెపంతో ఏకంగా పల్నాడు ఎస్పీ కార్యాలయంలోనే బైఠాయించారు. దాదాపు 10 గంటల పాటు ఎస్పీ ఛాంబర్లోనే కూర్చుని నియామక ఉత్తర్వులు ఇచ్చే వరకు కదిలేది లేదని భీష్మించుకోవడంతో పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. ఉన్నతాధికారుల వివరణను కూడా ఖాతరు చేయకుండా ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది.
ఈ ఉదంతం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో మంత్రులు నారా లోకేశ్(Nara Lokesh), వంగలపూడి అనిత కార్యాలయాల నుంచి ఎమ్మెల్యేకు ఫోన్ కాల్స్ వెళ్లాయి. నిరసన విరమించి వెనక్కి తగ్గాలని సూచించినా, అరవిందబాబు తన పంతం వీడకపోవడం చర్చనీయాంశమైంది. స్వయంగా పార్టీ ముఖ్య నేతలు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్గా తీసుకున్నారు.
ఈ వ్యవహారంపై ఎమ్మెల్యేకు క్లాస్ పీకిన చంద్రబాబు(Chandrababu).. ``రాజకీయాల్లో సుదీర్ఘ కాలం ఉండాలనుకుంటున్నారా? లేక ఒక్కసారే ఎమ్మెల్యేలుగా మిగిలిపోవాలనుకుంటున్నారా?`` అంటూ సూటిగా ప్రశ్నించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం అధికారులపై ఒత్తిడి తేవడం, ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడం వంటి పనులు చేస్తే పునరాలోచన లేకుండా సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. ఈ వార్నింగ్తో ఒక్కసారిగా పార్టీ శ్రేణుల్లో నిశ్శబ్దం ఆవరించింది. పవర్ చేతిలో ఉందని అతి చేస్తే పదవి ఊడటం ఖాయమనే సంకేతాన్ని బాబు ఈ ఘటన ద్వారా స్పష్టంగా ఇచ్చారు.