రాజకీయాల్లో గెలుపోటములను శాసించేది కేవలం నాయకుడి ఇమేజ్ మాత్రమే కాదు.. ఆ ఇమేజ్ను ఓటుగా మార్చే క్షేత్రస్థాయి యంత్రాంగం. సరిగ్గా ఇదే పాయింట్ దగ్గర జనసేన పార్టీ ఇన్నాళ్లూ వెనుకబడిందనేది బహిరంగ రహస్యం. అధినేత పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద లీడర్లు ఒకెత్తయితే.. పోలింగ్ రోజు ఓటర్లను బూత్ దాకా నడిపించే కార్యకర్తల సైన్యం లేకపోవడం మరో ఎత్తు. అయితే, ఇన్నాళ్లకు ఈ మైనస్ను గుర్తించిన పవన్ కళ్యాణ్(Pawan Kalyan), రూట్ మార్చి సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు.
త్వరలోనే రాబోతున్న స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికలను జనసేన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేవలం ప్రసంగాలు, ర్యాలీలతో సరిపెట్టకుండా.. అసలైన బలాన్ని నిరూపించుకోవాలంటే బూత్ లెవెల్ బలోపేతం ఒక్కటే మార్గమని జనసేనాని ఫిక్స్ అయ్యారు. ఇప్పటివరకు పైస్థాయి కమిటీలపైనే దృష్టి పెట్టిన అధినాయకత్వం, ఇప్పుడు ప్రతి ఓటరు ఇంటి తలుపు తట్టేలా బూత్ కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. సీనియర్ల సూచనలతో ఆలస్యంగానైనా కళ్ళు తెరిచిన జనసేన(Janasena), ఈసారి గ్రౌండ్ లెవెల్ ఆపరేషన్ను పక్కాగా ప్లాన్ చేస్తోంది.
నిజానికి ఏపీ రాజకీయాల్లో టీడీపీ(TDP), వైసీపీ, చివరికి కమ్యూనిస్టులు, కాంగ్రెస్లకు కూడా పటిష్టమైన బూత్ స్థాయి నెట్వర్క్ ఉంది. ఓటు బ్యాంకు తక్కువగా ఉన్నా కమ్యూనిస్టులు క్షేత్రస్థాయిలో నిలబడటానికి కారణం వారి కార్యకర్తలే. ఇప్పుడు జనసేన కూడా అదే ఫార్ములాను అందిపుచ్చుకుంటోంది. వచ్చే రెండు నెలలు పార్టీకి అత్యంత కీలకం కానున్నాయి. జెండా పట్టి, అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లే అసలైన సైన్యాన్ని క్షేత్రస్థాయిలో మోహరించేందుకు పవన్ కళ్యాణ్ వేస్తున్న ఈ మాస్టర్ స్ట్రోక్.. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.