ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గెలుపోటములు ఎంత సహజమో, తిరిగి పుంజుకోవడానికి నాయకులు వేసే వ్యూహాలు అంతకంటే ఆసక్తికరంగా ఉంటాయి. గత ఎన్నికల్లో ఊహించని పరాజయాన్ని చవిచూసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP), రాబోయే 2029 సమరానికి ఇప్పుడే పునాదులు వేస్తోంది. అయితే, ఈసారి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్న వ్యూహాలు పక్క రాష్ట్రమైన తమిళనాడులో సరికొత్త సంచలనం సృష్టించిన టీవీకే (TVK) అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నడిచిన బాటను గుర్తుచేస్తున్నాయి. ఫస్ట్ అటెంప్ట్లోనే అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న విజయ్ సక్సెస్ ఫార్ములాను జగన్ ఏపీలో ఇంప్లిమెంట్ చేయబోతున్నారనే చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా సాగుతోంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్ల ముందే ‘తమిళ వెట్రిగ కజగం’ పార్టీని ప్రకటించిన దళపతి విజయ్, క్షేత్రస్థాయిలో పక్కా ప్లానింగ్తో దూసుకెళ్లారు. సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా సరికొత్త టెక్నాలజీని, మైండ్ గేమ్ వ్యూహాలను నమ్ముకున్నారు. ఇందులో భాగంగానే ప్రముఖ వ్యూహకర్తలు కపిల్ సాహు, జాన్ ఆరోక్యసామి సేవలను ఆయన వినియోగించుకున్నారు. వీరు అందించిన గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్, సోషల్ మీడియా స్ట్రాటజీలు విజయ్(Vijay)ను రాత్రికి రాత్రే సీఎం కుర్చీపై కూర్చోబెట్టాయి. ఇప్పుడు సరిగ్గా ఇదే టీమ్ను రంగంలోకి దించేందుకు జగన్ కూడా పావులు కదుపుతున్నారు. గతంలో ప్రశాంత్ కిశోర్ (PK) వ్యూహాలతో 2019లో బంపర్ మెజారిటీ సాధించిన జగన్, 2029 కోసం విజయ్ కింగ్ మేకర్ అయిన కపిల్ సాహుతో ఇప్పటికే చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ముద్ర పడే అవకాశం ఉంది.
నాయకుడికి, కార్యకర్తకు మధ్య ఉండే దూరాన్ని తగ్గించడమే విజయ్ విజయానికి ప్రధాన కారణం. అందుకోసం ఆయన ‘మై టీవీకే’ అనే ప్రత్యేక యాప్ను రూపొందించి, ప్రతీ కార్యకర్తతో నేరుగా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఏపీలోనూ జగన్(Jagan) ఇదే డిజిటల్ అస్త్రాన్ని బయటకు తీశారు. గురువారం నాడు వైఎస్ జగన్ ఆవిష్కరించిన ‘జగన్ 2.0 సూపర్ యాప్’ అచ్చం విజయ్ యాప్ను పోలి ఉందనే విశ్లేషణలు వస్తున్నాయి. మధ్యవర్తులు, లీడర్ల ప్రమేయం లేకుండా కిందిస్థాయి కేడర్ నేరుగా అధినేతతో సంప్రదింపులు జరిపేలా, క్షేత్రస్థాయి ఫీడ్బ్యాక్ నేరుగా తాడేపల్లికి చేరేలా ఈ యాప్ను డిజైన్ చేశారు. విజయ్ ఫార్ములాను జగన్ ఎంతలా ఒంటబట్టించుకున్నారో చెప్పడానికి ఈ సూపర్ యాప్పే ఉదాహరణ.
రాజకీయాల్లో ఏ చిన్న సక్సెస్ ఫార్ములా కనిపించినా దాన్ని అందిపుచ్చుకోవడం సహజం. ప్రస్తుతం వైసీపీ(YCP) కూడా తమిళనాడులో ప్రూవ్ అయిన ‘విజయ్ మోడల్’ వైపే మొగ్గు చూపుతోంది. ఒకవైపు అరితేరిన వ్యూహకర్తల మేధస్సు, ఇంకోవైపు టెక్నాలజీతో క్యాడర్ను ఏకం చేసే ప్లాన్.. ఇవన్నీ చూస్తుంటే జగన్ 2029 ఎన్నికలను సీరియస్గా తీసుకున్నారని స్పష్టమైంది. మరి పొరుగు రాష్ట్రంలో పొలిటికల్ హిస్టరీ క్రియేట్ చేసిన ఈ స్ట్రాటజీ, ఏపీలో జగన్ను మళ్లీ సీఎం కుర్చీ వైపు నడిపిస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.