ఏపీలో వైసీపీ పాలనా కాలంలో జరిగిన లిక్కర్ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ``ఎందుకొచ్చిన ఖర్మ.`` అని ఆయన వ్యాఖ్యానించా రు. తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు మద్యం కేసులో కారుమూరిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం.. ఆయనను హదరాబాద్లోని ఈడీ కోర్టులో హాజరు పరిచారు. ఈ క్రమంలో అన్ని వివరాలనుఈడీ అధికారులు కోర్టు ముందు పెట్టడంతో.. ఆయనకు 2 వారాల పాటు(14 రోజులు) జ్యూడీషియల్ రిమాండ్ విధించారు. అనంతరం చంచల్ గూడ జైలుకు కారుమూరిని తరలించారు.
ఈ సందర్భంగా కోర్టు నుంచి పోలీసులు తనను కారులో తీసుకువెళ్తున్న సమయంలో కారుమూరి మీడియాతో ఒకటి రెండు మాటలు మాట్లాడారు. ``ఎందుకొచ్చిన ఖర్మ`` అని ఆయన వ్యాఖ్యానించారు. అదేవిధంగా ``మాకు సంబంధం లేదు. కావాలనే ఇరికించారు. రాజకీయ కక్షలు ఎల్లకాలం ఉండవు. నేను త్వరలోనే దీని నుంచి బయటపడతాను`` అని వ్యాఖ్యానించారు. అయితే.. తన కుమారుడి ప్రమేయాన్ని ఆయన తప్పుబట్టారు. తనకు ఇష్టం లేదని చెప్పినా.. తనను బలవంతంగా దీనిలోకి (మద్యం కుంభకోణం) లాగారన్న అర్థం వచ్చేలా కారుమూరి వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో పోలీసులు.. కారు విండోను మూసేశారు.
ఒకప్పుడు ప్రశంసించి..
ఒకప్పుడు చంచల్ గూడ జైలును కారుమూరి ప్రశంసించారు. జగన్ను చంచల్గూడ జైల్లో పెట్టారంటూ.. టీడీపీ నాయకులు చేసిన విమర్శలను ఆయన ఖండిస్తూ.. కృష్ణుడు అంతటి వాడే జైల్లో ఉన్నాడని.. అయినా చంచల్ గూడ జైలు.. జైలు కాదని పేర్కొన్నారు. అక్కడ సంస్కరణలకు పెద్దపీ టవేస్తున్నారని.. దానిని జైలుగా చూడరాదని ఆయన అప్పట్లో సమర్థించారు. కాగా.. తాజాగా ఆయనను అక్కడికే పంపడం గమనార్హం. ఇక, జ్యుడీషియల్ రిమాండ్లో భాగంగా కారుమూరికి లభించే సకల సదుపాయాలు, ఆయన జైల్లో ఉన్న అన్ని రోజులు న్యాయస్థానం పర్యవేక్షణలోనే ఉంటారు.
ఏంటి కేసు?
కారుమూరిపై కేసు విషయానికి వస్తే.. మద్యం బాటిళ్లను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రవాణా చేయడంలో సొమ్ములు చేతులు మారడమే. రవాణాకు సంబంధించి భారీగా ఇండెంటు పెట్టడం.. అక్రమంలో డిస్టిలరీల నుంచి వచ్చిన బాటిళ్లను ఎలాంటి తనిఖీకి దొరకుండా దొడ్డిదారిలో తరలించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే 87 కోట్ల రూపాయలను ఈడీ అధికారులు కారుమూరి కుటుంబం నుంచి సీజ్ చేశారు. అలాగే ఒక కారు, పలు విలువైన వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు.