పులివెందుల(Pulivendula)లో సై అంటే సై.. వైఎస్సార్ కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పుడు రాజకీయం రంజుగా మారుతోంది. మొన్నటి వరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క అన్నట్లుగా స్థానిక సంస్థల పోరుకు వేదిక సిద్ధమవుతోంది. ప్రత్యర్థులకు కంచుకోటైనా సరే, ఈసారి ఏకగ్రీవాలకు అస్సలు తావులేకుండా అన్ని స్థానాల్లోనూ పచ్చ జెండా ఎగరవేయాలని టీడీపీ పావులు కదుపుతుంటే, సొంతగడ్డపై పట్టు సడలకుండా చూసేందుకు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యూహాలకు పదును పెడుతున్నారు.
గత ఎన్నికల ఫలితాలు, మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పులివెందుల నియోజకవర్గంపై అధికార పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఏకగ్రీవాలు సాధించని ఇంచార్జీలకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు ఇవ్వబోమన్న జగన్ ప్రకటన ఇప్పుడు వైసీపీ(YCP) వర్గాలకే కాదు, ఆయన వ్యూహకర్తలకూ పెద్ద తలనొప్పిగా మారింది. ఈ నిబంధనను అడ్డం పెట్టుకుని, ఏకగ్రీవంగా స్థానాలు కైవసం చేసుకుని జగన్ను నైతికంగా దెబ్బతీయాలని టీడీపీ అధిష్టానం వేస్తున్న ప్లాన్లు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇదే జోరుతో నియోజకవర్గ ఇంచార్జి బీటెక్ రవికి పార్టీ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందడంతో, పులివెందులలో ప్రతి అడుగును ఎంతో జాగ్రత్తగా, ప్రతిష్టాత్మకంగా మలుస్తున్నారు.
ఈ పరిణామాలను గమనించిన వైఎస్ జగన్(YS Jagan), నష్టనివారణ చర్యలపై పూర్తిగా దృష్టి పెట్టారు. ఇడుపులపాయ టూర్ సందర్భంగానే పులివెందులపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. ఏ ఒక్క చోట కూడా ప్రత్యర్థులకు వాక్ ఓవర్ ఇవ్వకుండా, మున్సిపాలిటీలోని ప్రతీ స్థానంలోనూ వైసీపీ జెండా రెపరెపలాడేలా అభ్యర్థులను బరిలోకి దించేందుకు గ్రౌండ్ వర్క్ వేగవంతం చేశారు. స్థానిక నేతలు, ముఖ్య అనుచరులతో ప్రత్యేకంగా సమావేశమై దిశానిర్దేశం చేసేందుకు షెడ్యూల్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. బలహీనంగా ఉన్న స్థానాలను బేరీజు వేసుకుంటూ, చివరి నిమిషం వరకు పోరాడి తీరాల్సిందేనని కేడర్కు గట్టి సంకేతాలే ఇస్తున్నారు.
అటు టీడీపీ(TDP) శ్రేణులు కూడా ఈ అవకాశాన్ని అస్సలు చేజార్చుకోవద్దని కసితో పనిచేస్తున్నాయి. అధికారం చేతిలో ఉండటం, స్థానికంగా ఉన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నాయి. మొత్తానికి, ఒకరిది ఖిల్లాను కాపాడుకునే పోరాటమైతే, మరొకరిది కోట గోడలను బద్దలు కొట్టే ప్రయత్నం. ఈ నువ్వా నేనా పోరులో పులివెందుల పీఠం ఎవరిని వరించనుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. స్థానిక ఎన్నికల సమరం ముగిసేవరకు ఇక్కడ వేడి మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.