తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు చెందిన ఎర్రవల్లి ఫామ్ హౌస్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలతో పాటు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అక్కడ భూములలో సర్వే చేస్తున్న రెవెన్యూ అధికారులకు వెంకటాపూర్ గ్రామస్తులు కొత్త వాదనను వినిపించారు. సర్వే నెంబర్ 325 కింద ఉన్న 388 ఎకరాల భూమిలో 250 ఎకరాలు మాత్రమే ఎర్రవెల్లికి చెందినదని, మిగతా 138 ఎకరాలు వెంకటాపూర్ గ్రామ పరిధిలోకి వస్తాయని సదరు గ్రామస్తులు చెప్పడంతో అధికారులు షాక్ అయ్యారు.
పొరపాటున రెవెన్యూ అధికారులు గతంలో తమ గ్రామ పరిధిలోని భూమిని ఎర్రవల్లి సర్వే నెంబర్లలో కలిపారని వారు ఆరోపణలు చేశారు. పాత రెవెన్యూ రికార్డుల ఆధారంగా సర్వేను ఈసారైనా పక్కాగా నిర్వహించాలని అధికారులను వారు కోరారు. ఇక ఈ భూమిని సాగు చేస్తున్న రైతులను గుర్తించేందుకు అధికారులు వారికి నోటీసులు జారీ చేశారు. సంబంధించిన రైతులు భూముల దగ్గరకు వచ్చి వివరాలను అందించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నెల 21 నుంచి 4 దశలలో భూ సర్వే కొనసాగించబోతున్నామని అధికారులు వెల్లడించారు.