టాలీవుడ్ కింగ్ నాగార్జున , కోలీవుడ్ స్టార్ ధనుష్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ `కుబేర` చిత్రం రిలీజ్ డేట్ లాక్ అయింది. లవ్ స్టోరీలు, క్లాసిక్ చిత్రాలకు కేరాఫ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈసారి విభిన్నమైన కథతో కుబేర సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న, జిమ్ సర్బ్, దలీప్ తహిల్, సునైనా ముఖ్యమైన పాత్రలు పోషిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు కుబేర ను నిర్మిస్తున్నారు. తాజాగా మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. జూన్ 20న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కుబేర చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుపుతూ కొత్త పోస్టర్ ను లాంచ్ చేశారు.
`పవర్ కు సంబంధించిన కథ.. సంపద కోసం జరిగే యుద్ధం.. విధి ఆడించే ఆట.. కుబేరతో మంత్రముగ్ధులను చేసే థియేట్రికల్ అనుభవాన్ని అందించడానికి శేఖర్ కమ్ముల సిద్ధంగా ఉన్నారు` అనే క్యాప్షన్ తో తాజా పోస్టర్ ను వదిలారు. ఇందులో నాగార్జున, ధనుష్లతో పాటు జిమ్ సర్బ్ లను మనం చూడొచ్చు. కాగా, ఓ ధనవంతుడు, ఓ బిచ్చగాడు, డబ్బు చుట్టూ కుబేర స్టోరీ తిరుగుతుందని తెలుస్తోంది. ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్, నాగార్జున, ధనుష్, రష్మిక పాత్రలకు సంబంధించిన గ్లింప్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. పైగా మల్టీస్టారర్ కావడంతో ఇరు హీరోల అభిమానులు కుబేర కోసం ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు.