సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ..రాజకీయాలలో ఈ ఇద్దరు నాయకులు సమకాలీనులే. జాతీయ పార్టీ.. కాలం..అదృష్టం..రకరకాల కారణాలు కలిసివచ్చి మోదీ మూడో సారి ప్రధాని అయ్యారు. అదే సమయంలో రాష్ట్ర రాజకీయాలకే పరిమితమైన చంద్రబాబు నాలుగో సారి ముఖ్యమంత్రి అయ్యారు. అయినా సరే, చంద్రబాబును గౌరవించడంలో, ఆయనకు తగినంత ప్రాధాన్యతనివ్వడంలో మోదీ ముందుంటారు. సందర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబుపై ప్రశంసలు కురిపిస్తుంటారు. ఆ కోవలోనే తాజాగా మరోసారి చంద్రబాబును మోదీ ప్రశంసించారు.
అంతేకాదు, చంద్రబాబును ఫాలో కావాలంటూ పొరుగు రాష్ట్రాలకు సూచించారు. ప్రస్తుతం ఈ విషయం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ టూర్ లో ఉన్న చంద్రబాబు నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో 2.4 ట్రిలియన్ డాలర్ల ప్రగతి సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించామని చంద్రబాబు అద్భుతమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. వికసిత్ భారత్-2047 కల సాకారమయ్యేందుకు స్వర్ణాంధ్ర వికసించేందుకు ఏ విధంగా అడుగులు వేస్తున్నామో వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి కుటుంబానికి ‘ఫ్యామిలీ బెనిఫిట్ డిజిటల్ పాస్ బుక్’ ఇస్తామని ప్రకటించారు.