వైసీపీ అధినేత జగన్కు భారీ షాకిస్తూ.. కూటమి సర్కారు తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో చేపట్టిన జిల్లాల ఏర్పాటు, అప్పటికే ఉన్న జిల్లాల పేర్ల మార్పు విషయంలో తాజాగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా జగన్ సొంత జిల్లా కడప పేరును తిరిగి `వైఎస్సార్ కడప జిల్లా`గా మార్పు చేస్తూ.. కూటమి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల ఏర్పాటు చట్టం – 1974 ప్రకారం.. ప్రస్తుతం `వైఎస్సార్ జిల్లా`గా ఉన్న పేరును మార్పు చేస్తూ.. ఇక నుంచి `వైఎస్సార్ కడప జిల్లా`గా మార్చారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో ఎం.ఎస్. నెంబరు 170ని విడుదల చేసింది. వాస్తవానికి బ్రిటీష్ హయాంలో ఏర్పడిన జిల్లాకు అప్పట్లో `కడప` అనే పేరు వచ్చింది. ఈ పేరు ఎలా వచ్చిందనే దానిపై అనేక కథనాలు ఉన్నాయి.
ఇక, ఆ తర్వాత.. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంతో ఆయన ఆ జిల్లాకు చెందిన నాయకుడే కాబట్టి.. కాంగ్రెస్ పార్టీ నాయకులు.. కడప జిల్లా పేరును మారుస్తూ.. 2011లో `వైఎస్సార్ కడప జిల్లా`గా మార్పు చేశారు. ఇక అప్పటి నుంచి కూడా దీనిని అధికారికంగా.. వైఎస్సార్ కడప జిల్లాగానే పిలుస్తున్నారు. ఇది అలానే నోటెడ్ అయిపోయింది. అయితే.. గత వైసీపీ సర్కారు జిల్లా పేరులో పూర్తిగా `కడప`ను తొలగించేసి.. ఈ జిల్లాను రెండు ముక్కలు చేసి.. ఒకటి అన్నమయ్య, రెండు `వైఎస్సార్జిల్లా`గా పేర్కొంది.
అప్పట్లోనే ఇలా `కడప` పేరును తొలగించడంపై వివాదం అయింది. అయినప్పటికీ.. జగన్ పట్టించుకోలే దు. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇక్కడ పర్యటించిన సమయంలో కడప జిల్లా పేరును మార్చి.. అసలు కడప అన్నదే లేకుండా చేశారని ఇక్కడివారు వివరించారు. దీంతో తిరిగి జిల్లా పేరులో కడపను చేర్చనున్నట్టు అప్పట్లో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు తాజాగా ప్రభుత్వంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అయితే.. చంద్రబాబు కక్ష సాధింపులకు పోయి ఉంటే.. `వైఎస్సార్` పేరును కూడా తీసేసి.. ఒట్టి `కడప జిల్లా`గా మార్చేవారు. కానీ, ఆయన అలా కాకుండా.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన `వైఎస్సార్ కడప`గానే ఉంచడం విశేషం.