సోషల్ మీడియాలో కేసులకు సంబంధించి వైసీపీ కీలక నాయకుడు, జగన్ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డిని తాజాగా బుధవారం పోలీసులు విచారిం చారు. ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో విచారణ అధికారుల ముందుకు వచ్చిన ఆయనను తాడేపల్లి పోలీసులు ప్రశ్నించారు. సోషల్ మీడియాలో పోస్టులపై ఆయనను ప్రశ్నించగా .. ఆయన ఎదురు పోలీసులనే ప్రశ్నించారని.. సంబంధిత విచారణాధికారి గా ఉన్న సీఐ చెప్పడం గమనార్హం.
నాపై కేసులు పెట్టమని మీకు ఎవరు చెప్పారు? ఏ యే సెక్షన్ల కింద కేసులు పెట్టమని మీకు ఆదేశాలు వచ్చాయి? వారెరవో మీరే చెప్పాలి? అంటూ.. సజ్జల భార్గవరెడ్డి తమను ఎదురు ప్రశ్నించినట్టుసీఐ చెప్పడం విశేషం. ఇక, తాము అడిగిన ప్రశ్నలకు తెలియదు.. గుర్తులేదన్న సమాధానాలతో దాట వేత ధోరణిలోనే వ్యవహరించారని ఆయన వివరించారు. దీంతో తాము ఇవే విషయాలను ఉన్నతాధికారులకు చేరవేస్తామన్నారు.
అంతేకాదు.. ప్రస్తుతం జరిగిన విచారణ సంతృప్తిగా లేదన్న సీఐ.. మరోసారి నోటీసులు ఇవ్వనున్నట్టు తెలిపారు. కాగా.. సోషల్ మీడియా టీడీపీకి చెందిన అనిత సహా.. ఎస్సీ నాయకులను ఉద్దేశించి భార్గవ రెడ్డి దూషించినట్టు కేసు నమోదైంది. కడపకు చెందిన ఓ టీడీపీ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసులు నమోదు కాగా.. దీనిపై తాడేపల్లి పోలీసులకు బాధ్యతలు అప్పగిస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో భార్గవ రెడ్డిని విచారణకు పిలిచారు.
అయితే.. తొలి నాళ్లలోనే ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో విచారణ ఆలస్యమైంది. ఇటీవల విచారణకు సహకరించాలని.. పేర్కొన్న కోర్టు.. విచారణకు సహకరించకపోతే.. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని తెలిపింది.