ఓలా, ఉబెర్ లకు భారత్ ట్యాక్సీ చెక్

admin
Published by Admin — October 25, 2025 in National
News Image

ట్యాక్సీ....ఒకప్పుడు మహానగరాల్లోని రోడ్లపై జనం ఈ పిలుపు వినేవారు. కానీ, జమానా మారింది. జనం మారారు. ట్రెండ్ మారింది. క్యాబ్ ల రాకతో స్మార్ట్ ఫోన్లలోనే సైలెంట్ గా ట్యాక్సీ బుక్ చేసేస్తున్నారు. అదే అదునుగా ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ సర్వీస్ ప్రొవైడర్లు ఇటు జనం...అటు డ్రైవర్ల జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఈ క్రమంలోనే ఓలా, ఉబెర్ కు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. 'భారత్ ట్యాక్సీ' తో చౌక ధరలకే ప్రజలకు క్యాబ్ సేవలు అందుబాటులోకి తేనుంది. ఓలా, ఉబెర్ ల మాదిరి కాకుండా డ్రైవర్ల నుంచి ఎటువంటి కమీషన్లు వసూలు చేయకుండా ఈ సేవలు అందించనుండటం విశేషం.

బుక్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఓలా, ఉబర్ క్యాబ్ ఇంటి ముందు ప్రత్యక్షమవుతోంది. అంతవరకు బాగానే ఉంది. కానీ, పీక్ అవర్స్ లో మాత్రం కస్టమర్ల నుంచి ఈ రెండు సంస్థలు డబ్బు దండుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి. అంతేకాకుండా, డ్రైవర్ల నుంచి ప్రతీ రైడ్‌పై 25 శాతం వరకు అధిక కమీషన్లు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఇటు డ్రైవర్లు, అటు ప్రయాణికులకు లాభం కలిగించేలా కేంద్రం భారత్ ట్యాక్సీ తీసుకురానుంది.

కేంద్ర సహకార శాఖ, జాతీయ ఈ-గవర్నెన్స్ విభాగం (NeGD) కలిసి 'భారత్ ట్యాక్సీ'ని తీసుకురాబోతున్నాయి.

రూ.300 కోట్ల మూలధనంతో 'సహకార్ ట్యాక్సీ కో-ఆపరేటివ్ లిమిటెడ్' అనే సంస్థను కూడా ఈ భారత్ ట్యాక్సీ కోసం ఏర్పాటు చేశారు. ఈ భారత్ ట్యాక్సీ నడిపే డ్రైవర్లు కమీషన్లకు బదులుగా రోజువారీ లేదా నెలవారీ సభ్యత్వ రుసుము చెల్లిస్తే చాలు. అంటే, ప్రయాణ చార్జీలు పూర్తిగా డ్రైవర్లకే దక్కుతాయి. భారత్ ట్యాక్సీని పైలట్ ప్రాజెక్ట్‌గా నవంబర్ నుంచి ఢిల్లీలో 650 క్యాబ్‌లతో ప్రారంభించనున్నారు. ఆ తర్వాత డిసెంబర్‌లో ముంబై, పుణె, భోపాల్, జైపూర్ వంటి 20 నగరాలకు విస్తరిస్తారు. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో 'భారత్ ట్యాక్సీ'ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు.

Tags
Bharat taxi uber ola central government
Recent Comments
Leave a Comment

Related News