వైసీపీ అధినేత జగన్ కొన్ని కొన్ని విషయాల్లో ఆనందం వ్యక్తం చేస్తూ ఉండొచ్చు. తన పార్టీ నాయకులు.. కార్యకర్తలు తనపై ఎంతో ప్రేమను కూడా చూపిస్తున్నారని ఆయన భావిస్తూ ఉండొచ్చు. కానీ.. జగన్ అనుకునే ఆనందం.. జనాలకు ఆవేదనను కలిగిస్తోందనడంలో సందేహం లేదు. తాజాగా వెలుగు చూసిన మరో వీడియో.. వైసీపీ కార్యకర్తలు.. క్షేత్రస్థాయి నాయకుల పైశాచిక ఆనందానికి అద్దంగా మారిందన్న వాదన బలంగా వినిపిస్తోంది. కానీ.. జగన్ మాత్రం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.
ఈ నెలలో జగన్ పుట్టిన రోజును పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించారు. అయితే .. సత్యసాయి, అనంతపురం జిల్లాల్లోని పలు చోట్ల జగన్ ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేశారు. నడిరోడ్డుపై పొట్టేళ్ల ను, గొర్రెలను తెగనరికి.. వాటి నుంచి చిమ్ముతున్న రక్తంతో జగన్ ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేశారు. దీనిని కార్యకర్తలు ఓ పండుగగా నిర్వహించారు. ఇదే సమయంలో జగన్ కూడా తెరవెనుక ఆనందించి ఉండొ చ్చు. కానీ.. ప్రజలు మాత్రంఏవగించుకున్నారు. పోలీసులు కూడా కేసులు నమోదు చేశారు.
ఇదిలావుంటే.. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోనూ మరో ఘటన వెలుగు చూసింది. జిల్లాలోని.. నల్లజర్ల మండలం చోడవరంలో వైసీపీ శ్రేణులు జగన్ ప్లెక్సీ వద్ద మేకపోతు తల నరికి రప్ప రప్పా అంటు అలజడి సృష్టించారు. నరికిన మేకపోతు తల నరికి, కత్తితో వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. మేకపోతు రక్తాన్ని జగన్ ఫ్లెక్సీ కి అభిషేకం చేశారు. ఈ ఘటనలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. దీనిని వైసీపీ కార్యకర్తలు ఆనందించారు. కానీ, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫలితంగా చోడవరం గ్రామానికి చేరుకున్న పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిజానికి గోపాలపురం నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు. కానీ.. తొలిసారి రప్పారప్పా అంటూ.. నినాదాలు చేయడం.. స్థానికులను భయ భ్రాంతులకు గురి చేయడం కలకలం రేపింది. మొత్తంగా.. ఈ పరిణామాలు.. వైసీపీపై రక్తపు మరకలు పడేలా చేస్తున్నాయి. వీటిని ఇప్పుడే తుడుచుకుని.. కార్యకర్తలకు సీరియస్ వార్నింగ్ ఇవ్వకపోతే.. జగన్ ఆనందం.. మరోసారి ప్రజలకు ఆగ్రహం తెప్పించి.. ఆ పార్టీని పూర్తిగా విస్మరించే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదు.