తెలుగుదేశం పార్టీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఓ మహిళ నేత సొంత పార్టీ నేతల నుంచి నానా ఇబ్బందులు పడుతున్నారా ? టిడిపి సీనియర్లు అందరూ కలిసి ఆ ఎమ్మెల్యేను ముప్పు తిప్పులు పెడుతున్నారా ? రాజకీయంగా అత్యంత కీలకమైన స్థానంలో ఎమ్మెల్యేగా గెలిచిన ఆ మహిళ నేత తన నియోజకవర్గంలో పార్టీ పరంగా పట్టు కోసం సొంత పార్టీ నేతలతోనే యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చేసిందా ? అంటే గుంటూరు జిల్లా రాజకీయ వర్గాలు అవును అన్న ఆన్సర్లు ఇస్తున్నాయి. ఏడాదిన్నర క్రితం జరిగిన సాధారణ ఎన్నికలలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి బీసీ మహిళ గల్లా మాధవి విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో సామాజిక సమీకరణల నేపథ్యంలో గల్లా మాధవి అనూహ్యంగా టిక్కెట్ దక్కించుకుని వైసీపీ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి విడుదల రజినిపై ఏకంగా 53,000 ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు.
మాధవి భర్త గల్లా రామచంద్ర నాయుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఈ సమీకరణం కూడా మాధవికి టికెట్ రావటానికి కారణం అయింది. నియోజకవర్గంలో తొలి ఆరు నెలల పాటు అంతా బాగానే ఉన్నట్టు కనిపించింది. ఎమ్మెల్యేకు అందరూ సహకరించారు. ఆ తర్వాత ఆధిపత్యం కోసం నేతల మధ్య వర్గ విభేదాలు మొదలయ్యాయి. జిల్లా కేంద్రం కావడంతో పాటు అత్యంత కీలకమైన నియోజకవర్గం కావడంతో ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన కీలక నేతల అందరూ ఈ నియోజకవర్గంలోనే నివాసం ఉంటున్నారు. ఇక్కడ మాధవి ఎమ్మెల్యేగా ఉండడంతో ఏ పని చేయాలన్నా ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ సీనియర్ నేతల రికమండేషన్లు మాధవి పై ఎక్కువగా ఉన్నాయట.
అయితే నియోజకవర్గంలో ఇతర నేతల పెత్తనాన్ని మాధవి అస్సలు ఒప్పుకోవడం లేదట. ప్రతి పనిలోనూ ఎమ్మెల్యే మాధవికి వ్యతిరేకంగా మిగిలిన నేతలు పావులు కదుపుతున్నారట. ఇది మాధవికి అస్సలు నచ్చకపోవడంతో పార్టీలో వర్గ విబేధాలు తీవ్రమవుతున్నాయి. నా నియోజకవర్గంలో ఇతర నియోజకవర్గాలకు చెందిన నేతలు, ఎమ్మెల్యేల పెత్తనం ఏంటి ? అన్నది ఆమె ప్రశ్న. జిల్లా కేంద్రంలో తమ మాటకు విలువ లేకపోతే ఎలా ? అన్నది మిగిలిన నేతల డిమాండ్. ఎన్టీఆర్ స్టేడియం ఎన్నికల వ్యవహారంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మేయర్ కోవెలమూడి రవీంద్రకు ఎమ్మెల్యే మాధవికి మధ్య జరుగుతోన్న వార్ నివురుగప్పిన నిప్పులా మారింది.
కొందరు టీడీపీ నేతల మద్దతు ఉండడంతో కీలక అధికారులు సైతం ఎమ్మెల్యే మాధవి మాట లెక్కచేయడం లేదట. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా పనులు చేయడం ఏంటి ? తాను చెప్పిన పనులు ఎందుకు చేయరు ? అని మాధవి అధికారులపై మండిపడుతున్నారట. కొందరు కీలక నేతలు సైతం నియోజకవర్గంలో మాధవికి వ్యతిరేకంగా పావులు కదుపుతూ వచ్చే ఎన్నికల నాటికి ఆమెను తప్పించేలా రాజకీయాలు మొదలు పెట్టేశారన్న ప్రచారం కూడా పార్టీ వర్గాల్లో జరుగుతోంది. మరి ఈ టార్గెట్ రాజకీయాన్ని మాధవి ఎలా ఎదుర్కొంటారో ? చూడాలి.