బీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్పై కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వల్లే.. కేసీఆర్కు బీపీ-షుగర్ వచ్చాయన్నారు. నిజాలు మాట్లాడేవారికి ఎలాంటి జబ్బులు ఉండవన్నారు. అందుకే తాను ఆరోగ్యంగా ఉన్నట్టు తెలిపారు. కానీ.. నిజాలు మాట్లాడని కేసీఆర్కే అన్ని జబ్బులు వచ్చాయని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనపై తాను కోట్లాడినందుకే.. ఆయనకు బీపీ-షుగర్ వచ్చాయన్నారు.
ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన ప్రచార ఘట్టం జోరుగా సాగుతోంది. బీజేపీ తరఫున కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ప్రచారాన్ని దుమ్ము రేపుతున్నారు. ఈ క్రమంలో సొంత ఇలాకా.. కరీంనగర్లో ఆదివారం ఆయన ప్రచారం చేపట్టారు. దీనిలో భాగంగా చొప్పదండిలో నిర్వహించిన ప్రచార సభలో బండి మాట్లాడుతూ.. బీజేపీ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలిపారు. కేసీఆర్.. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టు పట్టించారని విమర్శించారు. అన్నీ అబద్ధా లు మాట్లాడబట్టే కేసీఆర్కు రోగాలు వచ్చాయన్నారు.
తాను ఎంతో నిజాయితీ పరుడినని, రూపాయి అవినీతి కూడా చేయలేదని చెప్పిన బండి.. కరీంనగర్ అభివృద్దికి తాను ఎంతో శ్రమిస్తున్నట్టు తెలిపారు. బీజేపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాకారం అవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే.. పన్నులు పెంచుతారని.. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలో అనేక రూపాల్లో ప్రజలపై భారాలు మోపు తున్నారని ఆరోపించారు. త్వరలోనే కరీంనగర్ అభివృద్ధికి ప్రత్యేక అజెండా ప్రకటిస్తానన్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే.. కేంద్రం నుంచి నిధులుతీసుకువచ్చి మునిసిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు బండి వివరించారు.