రాజకీయాలు.. అంటే అనుకున్నంత తేలికకాదు. ఈ రోజు ఉన్న వ్యూహం రేపు ఉండదు. రేపు ఉన్నది ఎల్లుండికి మారొచ్చు. సో.. కాలానుగుణంగా పార్టీలు, నాయకులు కూడా మార్పుల దిశగా అడుగులు వేయా ల్సిన అవసరం ఉంది. దీనిని అందిపుచ్చుకోకపోతే.. ఫలితం ఎలా ఉంటుందన్నది.. పొరుగున ఉన్న తెలంగాణలో ప్రస్తుతం జరిగిన మునిసిపల్ ఎన్నికలే చెబుతున్నాయి. ఇక్కడ బీఆర్ ఎస్కు పునరుజ్జీవం వచ్చిందని అనుకున్నదశలో మరోసారి ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో తెలిసిందే.
అలానే ఏపీలోనూ వైసీపీ పరిస్థితి ఉండే అవకాశం కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. కూటమి సర్కారు లేవనెత్తుతున్న అంశాలపై ఎదురు దాడి చేస్తున్న వైసీపీ నాయకులు వాటి వాస్తవాలను విస్మరిస్తోంది. వాస్తవానికి కూటమి సర్కారు కీలక పాయింట్లను లేవనెత్తుతోంది. 1) తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ. 2) హిందూ దేవాలయాల్లో జరిగిన అపచారం. 3) రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేశారు. 4) వివేకానందరెడ్డి దారుణ హత్య. ఈ 4 అంశాలను వైసీపీ రాజకీయ కోణంలో చూస్తోంది.
ఇదేదో కావాలనే తమపై కూటమి బురదజల్లుతోందని వైసీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ, వాస్త వానికి ఇవి ప్రజల్లో బలంగా నాటుకుపోయిన అంశాలు. ఇవి.. తూతూ మంత్రం అన్నట్టుగా.. అప్పటికప్పు డు వచ్చి పోయే విషయాలు కాదు. ఇవే వైసీపీని ఎప్పటికైనా పట్టి పీడించే అంశాలు. ఎన్నికలు జరిగి రెండేళ్లు గడిచినా.. ఈ నాలుగు విషయాలు ఇంకా లైవ్లోనే ఉన్నాయంటే.. ప్రజల్లో ఎంత బలంగా ఇవి నాటుకున్నాయో వైసీపీ గుర్తించాలి. ఈ క్రమంలో అసలు ఏం జరిగింది? అనేది ఈ నాలుగు అంశాలపైనా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇదేదో మీడియా ముందు చెబితేనో.. నాలుగు గోడల మధ్య కూర్చుని ప్రకటన ఇస్తేనో.. జరిగే పనికాదు. ప్రజల్లోకి రావాల్సిందే. పనిగట్టుకుని ఓ ఏడాది పాటు ఆ నాలుగు అంశాలపై ప్రజలకు వివరించాల్సిందే. ఈ పనిచేయనంత కాలం వైసీపీని ఇవి వెంటాడుతూనే ఉంటాయి. ఇక, రప్పా-రప్పా.. సహా నాయకుల బూతుల రాజకీయాలకు కూడా కట్టడి చేయాలి. ఇవి.. జగన్ అంటేఎంత అభిమానం ఉందని అనుకున్నా మధ్యతరగతి ప్రజలను ఆ పార్టీకి దూరం చేస్తున్నాయి. అంతేకాదు.. ఇదేసమయంలో కూటమికి కలిసి వస్తున్న అంశాలు కూడా ఇవే కావడం గమనార్హం.