ప్రపంచ యాత్రికుడిగా తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ సృష్టించిన యూట్యూబర్ `నా అన్వేషణ` అన్వేష్ సోషల్ మీడియా సామ్రాజ్యానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎప్పుడూ విదేశీ వింతలు, విశేషాలతో వార్తల్లో నిలిచే అన్వేష్, ఈసారి తన అకౌంట్ బ్యాన్ కావడంతో హాట్ టాపిక్గా మారారు. ఏకంగా 1.3 మిలియన్ల (13 లక్షలు) ఫాలోవర్స్ ఉన్న ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇప్పుడు సెర్చ్ చేసినా కనిపించడం లేదు.
సాధారణంగా ఏదైనా అకౌంట్ బ్యాన్ అవ్వాలంటే రిపోర్ట్స్ రావాలి, కానీ ఇక్కడ సీన్ వెరైటీగా జరిగింది. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఇన్స్టాగ్రామ్ యాజమాన్యానికి రాసిన ఒక్క లెటర్ అన్వేష్ అకౌంట్ భవితవ్యాన్ని మార్చేసింది. అసలు ఈ వివాదానికి బీజం పడింది నటి కరాటే కల్యాణి చేసిన ఫిర్యాదుతో. అన్వేష్ తన వీడియోల ద్వారా దేశ గౌరవానికి భంగం కలిగిస్తున్నాడని ఆమె పోలీసులను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన సైబర్ క్రైమ్ పోలీసులు, అన్వేష్ పోస్ట్ చేసిన వివాదాస్పద కంటెంట్ను క్షుణ్ణంగా పరిశీలించారు. దేశ భద్రత, సామాజిక సామరస్యానికి భంగం కలిగించే అంశాలు ఉన్నట్లు నిర్ధారించుకున్నాకే.. అకౌంట్ను తొలగించాలని ఇన్స్టాగ్రామ్కు అధికారికంగా లేఖ రాశారు.
పోలీసుల నుంచి వచ్చిన సమాచారాన్ని ఇన్స్టాగ్రామ్ టీమ్ సీరియస్గా తీసుకుంది. అన్వేష్ అకౌంట్ను రివ్యూ చేసిన తర్వాత, కమ్యూనిటీ గైడ్లైన్స్ను ఉల్లంఘించినట్లు నిర్ధారణ కావడంతో వెంటనే బ్యాన్ వేటు వేసింది. దీంతో లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్న అకౌంట్ ఒక్క నిమిషంలో మాయమైపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.