మెగా కోడలు, టాలీవుడ్ ‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠి ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన ‘సతీ లీలావతి’ చిత్రం మార్చి 6న విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ప్రమోషన్లలో భాగంగా లావణ్య పంచుకున్న విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సాధారణంగా గర్భవతిగా ఉన్నప్పుడు నటీమణులు షూటింగ్స్కు బ్రేక్ ఇస్తారు. కానీ, లావణ్య మాత్రం తన ఆరోగ్యం కంటే వృత్తికే ప్రాధాన్యతనిచ్చి పెద్ద సాహసమే చేశారు.
ప్రెగ్నెన్సీ సమయంలో లావణ్యకు డాక్టర్లు కీలక సూచనలు చేశారట. ముఖ్యంగా ఎక్కువ ప్రయాణాలు చేయవద్దని, విశ్రాంతి తీసుకోవాలని హెచ్చరించారట. అయితే, అప్పటికే సతీ లీలావతి షూటింగ్ కీలక దశకు చేరుకుంది. తాను నో చెబితే నిర్మాతలు భారీగా నష్టపోతారని భావించిన లావణ్య, తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి షూటింగ్లో పాల్గొన్నారు. ``రామోజీ ఫిలిం సిటీకి ప్రతిరోజూ ప్రయాణం చేయడం ఇబ్బందిగా ఉన్నా, బాధ్యతగా వెళ్లేదాన్ని`` అని ఆమె తాజాగా యాంకర్ సుమతో జరిగిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
షూటింగ్ సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను కూడా లావణ్య రివీల్ చేశారు. ఒకవైపు ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే వాంతులు, మరోవైపు తీవ్రమైన మైగ్రేన్ నొప్పి తనను వేధించాయని.. అయినప్పటికీ సెట్లో ఎవరికీ తన పరిస్థితి తెలియకూండా టాబ్లెట్లు వేసుకుని మరీ కెమెరా ముందుకు వచ్చేదాన్ని అని లావణ్య చెప్పుకొచ్చారు. భయం భయంతోనే షూటింగ్ కంప్లీట్ చేశానని.. ప్రతి షెడ్యూల్ చివరన నేరుగా హాస్పిటల్కు వెళ్లి చెకప్ చేసుకునేదాన్నని తెలిపారు.
డ్యాన్స్ సీక్వెన్స్ సమయంలో చాలా ఆందోళనగా ఉండేదని.. అయితే కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ తన పరిస్థితిని అర్థం చేసుకుని తగిన విధంగా స్టెప్స్ కంపోజ్ చేశారని.. అలాగే కాస్ట్యూమ్స్ కూడా బేబీ బంప్ కనిపించకుండా ప్రత్యేకంగా లూజ్గా డిజైన్ చేయించామని లావణ్య పేర్కొన్నారు. కాగా, ఈ సినిమాలో లావణ్య కొన్ని యాక్షన్ సీక్వెన్స్లు కూడా చేశారు. గర్భంతో ఉండి ఫైట్స్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ముఖ్యంగా నాలుగో నెలలో ప్యాచ్ వర్క్ కోసం షూటింగ్కు రావడం ఆమె డెడికేషన్కు నిదర్శనం. ఇక వరుణ్ తేజ్ మరియు కుటుంబ సభ్యులు మొదట భయపడినా, తన పట్టుదలను చూసి పూర్తి సపోర్ట్ అందించారని లావణ్య ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.