వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలు ఇప్పుడు ఆ పార్టీ కార్యకర్తల్లో ఒక రకమైన భయాన్ని, ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. ఎవరినో పరామర్శించడానికి జగన్ వస్తుంటే.. ఆ పర్యటనలో పాల్గొనేందుకు వెళ్తున్న సొంత పార్టీ శ్రేణులే విగతజీవులుగా మారుతుండటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
నిరుడు జూన్లో జగన్ పల్నాడు పర్యటనకు వెళ్తుండగా.. గుంటూరు జిల్లా ఏటుకూరు సమీపంలో జగన్ కాన్వాయ్లోని వాహనం ఢీకొని చీలి సింగయ్య (65) అనే వైసీపీ కార్యకర్త మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మాజీ మంత్రి జోగి రమేశ్ను పరామర్శించడానికి వెళ్తుండగా ఇబ్రహీంపట్నంలో ఇద్దరు వైసీపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోవడం సంచలనం విషాదం నింపింది. దీంతో.. జగన్ పర్యటనల చుట్టూ ఏదో ఒక మృత్యు నీడ వెంటాడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజా ఘటనలో.. చిల్లకల్లు గ్రామానికి చెందిన పంచాయతీ ప్రెసిడెంట్ రాంబాబు (41), తన నాయకుడిని చూడాలనే ఉత్సాహంతో బయలుదేరి దారిలోనే కుప్పకూలిపోయారు. షుగర్ లెవల్స్ పడిపోవడంతో ఆయన ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. జగన్ను చూసేందుకు ఆయన ఉదయం 11 గంటలకు ఇబ్రహీంపట్నం వచ్చి.. జోగి ఇంటికి కొద్దిదూరంలో రోడ్డుపై పడిపోయారు.
పాతపంచాయతీ కార్యాలయంలో ఉన్న వైద్య ఆరోగ్య సిబ్బంది ఆయనకు వైద్యసేవలు అందించి 108లో గొల్లపూడిలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించగా.. అప్పటికే ఆయన గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు, ఇబ్రహీంపట్నం కొత్తగేటుకు చెందిన భార్గవ్ అనే యువకుడు, జగన్ వస్తున్నాడన్న అతి ఉత్సాహంతో బైక్ స్టంట్లు చేస్తూ బార్ గేట్ను ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఒకరిని ఓదార్చడానికి వెళ్తున్న జగన్, తన రాకతో మరో ఇద్దరిని కానరాని లోకాలకు పంపారనే చర్చ సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతోంది. జగన్ కారు కింద పడి సింగయ్య ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఇప్పటికీ విచారణ జరుగుతూనే ఉంది. అసలు జగన్ పర్యటనల సమయంలో భద్రతా వైఫల్యాలు ఉంటున్నాయా? లేక కార్యకర్తల అతి ఉత్సాహం ప్రాణాల మీదకు తెస్తుందా? అన్నది పక్కన పెడితే.. ఆయన అడుగు పెట్టిన ప్రతిచోటా అపశకునాలు ఎదురవుతుండటం, సొంత పార్టీ కార్యకర్తలే ప్రాణాలు కోల్పోతుండడం వైసీపీ వర్గాలను కలవరపెడుతోంది.
రాజకీయాల్లో నాయకుడిపై అభిమానం ఉండటం సహజం. కానీ, జగన్ పర్యటనల కోసం చేసే హడావుడి, బైక్ ర్యాలీలు, ప్రమాదకరమైన స్టంట్లు యువ కార్యకర్తల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. జగన్ అడుగు పెడితే శవాలు లేవాల్సిందే అనే ముద్ర పడకముందే, పార్టీ అధిష్టానం కార్యకర్తల భద్రతపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
దళితులపై దొంగ ప్రేమ..
దళితులపై తనకు వల్లమాలిన ప్రేమాభిమానాలు ఉన్నట్టు నటించే జగన్.. నిరుడు తన కారు కింద పడి మరణించిన సింగయ్య కుటుంబాన్ని మాత్రం వారి ఇంటికి వెళ్లి పరామర్శించలేదు. వారినే తన ఇంటికి రప్పించుకుని కంటితుడుపు పరామర్శ చేశారు. నిజానికి జడ్ ప్లస్ కేటగిరీ ఉన్న నాయకులు యాత్రగా వెళ్లేటప్పుడు పోలీసుల మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి. యాత్ర సాగేటప్పుడు కారు తలుపు తీయకూడదు.
అద్దాలు కిందికి దించకూడదు. కానీ, జగన్ ఆ మార్గదర్శకాలను అస్సలు పాటించడం లేదు సరికదా.. వాటికి విరుద్ధంగా నడుచుకుంటూ తన అభిమానుల ప్రాణాలే పోవడానికి కారణమవుతున్నారు. యాత్ర సాగుతుండగా కారు డోరు తీసి తలుపు దగ్గర నిలబడుతున్నారు. అలా చేయడం వల్ల తన ప్రాణాలకు కూడా ప్రమాదమే. అయినప్పటికీ కావాలనే అలా నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్తూ.. ఏవైనా అపశ్రుతులు చోటుచేసుకుంటే పోలీసుల వైఫల్యం అని ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల్లో అలా చేయడం సహజమే అని సరిపెట్టుకుందామనుకున్నా.. దానికి పార్టీ కార్యకర్తలను బలిపెట్టేంత వికృత మనస్తత్వం ఏమిటనేదే ప్రశ్న.