అనకాపల్లి జిల్లాలో పారిశ్రామిక గర్జన మొదలైంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, మంత్రి నారా లోకేష్ ఉత్తరాంధ్ర యువతకు భారీ కానుకను అందించారు. రాంబిల్లి మండలం సీతపాలెం సెజ్ వేదికగా ఏపీ పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చేసే కీలక అడుగు పడింది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తరిమికొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న కూటమి ప్రభుత్వం, చెప్పినట్లుగానే పరిశ్రమల వేటను ముమ్మరం చేసింది. తాజాగా రూ. 2,300 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న `బ్లూ జెట్ హెల్త్కేర్` యూనిట్కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. ఇది కేవలం ఒక ఫార్మా కంపెనీ మాత్రమే కాదు.. ఈ ప్రాంతంలోని 1,750 మంది స్థానిక యువత కలల సౌధం. ప్రత్యక్షంగా ఇంతమందికి ఉపాధి లభించనుండటంతో ఉత్తరాంధ్ర నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయి.
ఈ సందర్భంగా లోకేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ``గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడమే మా మొదటి ప్రాధాన్యత. మేము కేవలం హామీలు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రభుత్వం కాదు.. పరిశ్రమలను రప్పించి, యువతకు ఉద్యోగాలు ఇచ్చి చూపించే ప్రభుత్వం`` అని ఆయన గంటాపథంగా చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న బ్లూ జెట్ వంటి సంస్థ ఆంధ్రప్రదేశ్ను ఎంచుకోవడం, రాష్ట్రంలో మారిన వ్యాపార అనుకూల వాతావరణానికి నిదర్శనమని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి ఉన్నప్పటికీ, ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న సుస్థిర పారిశ్రామిక విధానం ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని నింపింది. రాబోయే రోజుల్లో విశాఖ-అనకాపల్లి బెల్ట్ అనేది ప్రపంచ స్థాయి ఫార్మా మరియు ఐటీ హబ్గా మారుతుందని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. కేవలం రెడ్ కార్పెట్ వేయడమే కాదు.. పరిశ్రమలకు అవసరమైన అనుమతులను మెరుపు వేగంతో మంజూరు చేస్తూ, మౌలిక సదుపాయాల కల్పనలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మొత్తానికి, లోకేష్ వేస్తున్న ఈ స్పీడ్ చూస్తుంటే.. ఏపీ మళ్ళీ పారిశ్రామికంగా పూర్వ వైభవాన్ని సంతరించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.