ఏపీ శాసన మండలి(ap legislative council)లో.. క్రిస్టియన్(christian) వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చర్చ సందర్భంగా వైసీపీ సభ్యులు మాట్లాడుతూ.. 2019-24 మధ్య చంద్రబాబు, ఆయన కుటుంబం తిర మలకు వెళ్లారని.. ఆ సమయంలో లడ్డూ కూడా తిన్నారని, కానీ ఎలాంటి ఫిర్యాదులు చేయలేదన్నారు. అదేవిధంగా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవంలోనూ లక్ష లడ్డూలను పంపించినప్పుడు.. అక్కడికి కూడా చంద్రబాబు, పవన్ కల్యాణ్లు వెళ్లారని.. అప్పుడు కూడా కల్తీ అని వ్యాఖ్యానించలేదన్నారు.
కానీ, ఉద్దేశ పూర్వకంగానే వైసీపీపై విమర్శలు చేస్తున్నారని.. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసి నట్టు సీబీఐ నివేదికలో పేర్కొనలేదన్నారు. ఈ సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు(minister achennaidu) స్పందిస్తూ.. మండ లి చైర్మన్ సహా.. మాజీ సీఎం జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ``మీరు క్రిస్టియన్.. జగన్ క్రిస్టియన్.. అందుకే తిరుమల లడ్డూకు ఉన్న ప్రాధాన్యం గుర్తించడం లేదు`` అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా మంటలు రేపాయి.
మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై మండలి చైర్మన్ మోషేన్ రాజు(council chairman moshes raju) ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ``నువ్వు నన్ను క్రిస్టియన్ అంటావా? నేనెవరో తెలుసా?`` అంటూ వ్యాఖ్యానించారు. దీనికి అచ్చెన్న బదులిస్తూ.. మీరు క్రిస్టియన్ అని మరోసారి వ్యాఖ్యానించే సరికి చైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తాను క్రిస్టియన్ కాదని.. పూర్తి హిందువునని ప్రకటించారు. అంతేకాదు.. సభలో లేని వ్యక్తుల గురించి(జగన్) మాట్లాడడం కూడా సరికాదన్నారు.
ఈ సమయంలో వైసీపీ సభ్యులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. మండలిలో కులాల ప్రస్థావన తీసుకువచ్చారని.. దీనికి మంత్రి అచ్చెన్నాయుడు క్షమాపణలు చెప్పాలన్నారు. ఈ సమయంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ``నాకు తెలిసిన మేరకు మీరు(చైర్మన్) క్రిస్టియన్ అనుకున్నాను. మీరు కాదని అన్నారు కాబట్టి.. నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను`` అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై చైర్మన్ .. సంతృప్తి చెందుతున్నట్టు ప్రకటించారు. కానీ, వైసీపీ సభ్యులు మాత్రం అచ్చెన్న క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టడం.. పోడియంను చుట్టుముట్టడంతో మండలిలో మరోసారి గందరగోళం నెలకొంది. దీంతో సభను వాయిదా వేశారు.