ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు(raghurama krishna raju).. ఎంపీగా ఉన్న సమయంలో ఆయనను వేధించి, కస్టడీలో టార్చర్(custodial torture) చేశారన్న కేసు తెలిసిందే. ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఆనాడు సీఐడీ విభాగంలో కీలకంగా పనిచేసిన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్(ips sunil naik)ను విచారించేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే... ఆయన మాత్రం పలుకారణాలు చెబుతూ.. ఈ కేసు నుంచి రక్షణ పొందుతున్నారు. అయితే.. తాజాగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణకు ఎట్టి పరిస్థితిలోనూ హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. బిహార్ హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా ముగిసిన నేపథ్యంలో తాము ఇస్తున్న ఉత్తర్వులే అమలవుతాయని తెలిపింది.
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గుంటూరు పోలీసుల విచారణకు సాధారణ దుస్తుల్లో హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. మధ్యలో భోజన విరామం ఇవ్వాలని పోలీసులకు సూచించింది. ఇదేసమయంలో పోలీసులకు కూడా కొన్ని సూచనలు చేసింది. ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని.. అరెస్టు చేయొద్దని తేల్చి చెప్పింది. ఇదేసమయంలో దుర్భాష లు చేయొద్దని తెలిపింది. విచారణకు సహకరించాలని సునీల్ నాయక్కు సూచించింది. తదుపరి కోర్టు ఇచ్చే ఆదేశాల వరకు విచారణ కొనసాగుతుందని.. ఒకవేళ పోలీసులకు సహకరించని పక్షంలో తమకు తెలియజేయాలని కూడా ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
ఆ ఒక్కటే పట్టించింది..
ఈ కేసు నుంచి తనను తాను తప్పించుకునేందుకు సునీల్ నాయక్ ఆది నుంచి ఓ పాయింట్ చెబుతున్నారు. కస్టడీలో టార్చర్ కేసులో నమోదు చేసిన తొలి ఎఫ్ ఐఆర్లో తన పేరు లేదని ఆయన వాదిస్తున్నారు.. ఆ తర్వాత.. రాజకీయ దురుద్దేశంతోనే తన పేరు చేర్చారని కాబట్టి.. తనకు ఈ కేసుతో సంబంధం లేదన్నారు. అయితే.. హైకోర్టు ఈ విషయంలో పలు సుప్రీంకోర్టు తీర్పులను ఉదహరించింది. ఎఫ్ ఐఆర్ నమోదైన తర్వాత.. కూడా నిందితులుగా అనుమానిస్తే ఎవరినైనా ఎప్పుడైనా ఎఫ్ ఐఆర్లో చేర్చవచ్చని.. ఈ స్వేచ్ఛ పోలీసులకు ఉంటుందని వ్యాఖ్యానించింది. ఐపీఎస్ అధికారిగా ఈ విషయం సునీల్నాయక్ కు తెలియదని తాము భావించడం లేదని వ్యాఖ్యానించింది.
విచారణకు వస్తారా?
ప్రస్తుతం బిహార్లోనే విధులు నిర్వహిస్తున్న సునీల్ నాయక్ను అదుపులోకి తీసుకునేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నించి.. ఒకసారి వెనుదిరగాల్సి వచ్చింది. ట్రాన్సిట్ వారెంట్ను అక్కడి కోర్టు కొట్టి వేసింది. తాజాగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు.. బిహార్ కోర్టుకు తెలిపి.. అక్కడి నుంచి సునీల్ నాయక్ను తీసుకురావాల్సి ఉంటుంది. ఇదేసమయంలో ముందస్తు బెయిల్పిటిషన్ను కూడా హైకోర్టు కొట్టి వేసిన నేపథ్యంలో ఆ వెంటనే సునీల్ నాయక్ బిహార్ హైకోర్టులో పిటిషన్ వేసినట్టు పోలీసులు అనుమానిస్తు న్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఏమేరకు విచారణకు సహకరిస్తారన్నది చూడాలి. ఇదిలావుంటే.. ఉన్నతాధికారులు చెప్పారు కాబట్టే.. ఆనాడు రఘురామను అదుపులోకి తీసుకున్నామని సునీల్ నాయక్ అంటున్నారు. కానీ, దీనిని సైతం హైకోర్టు తోసిపుచ్చింది.