దేశమంతా విస్తరించటం.. తిరుగులేని అధికారాన్ని సొంతం చేసుకోవాలన్న పెద్ద ప్లాన్ తో పావులు కదుపుతోంది బీజేపీ. అందుకు తగ్గట్లే తన వ్యూహాల్ని అమలు చేస్తోంది. బీజేపీయేతర రాష్ట్రాల్లో అధికారాన్ని హస్తగతం చేసుకోవటానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తన్న కమలనాథులు.. మొదట్లో ఆయా రాష్ట్రాల్లోని బలమైన పార్టీలతో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవటం.. ఒకసారి అధికారం చేతికి వచ్చిన తర్వాత నుంచి తన ప్లాన్ ను అమలు చేస్తున్న వైనం తెలిసిందే. ఇందులో భాగంగా మహారాష్ట్రను సొంతం చేసుకున్న బీజేపీ.. ఇప్పుడు బిహార్(Bihar) మీద ఫోకస్ చేసినట్లుగా కనిపిస్తోంది.
ఇందులో భాగంగా కొత్త వ్యూహానికి తెర తీసినట్లుగా కనిపిస్తోంది. బిహార్ అధికార పీఠాన్ని సొంతం చేసుకోవటం కోసం రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్(cm nitish kumar) తో రహస్య ఒప్పందం జరిగిందా? అన్నది ప్రశ్నగా మారింది. అదే నిజమైతే.. త్వరలో బిహార్ కు కొత్త సీఎం బీజేపీకి చెందిన నేత అవుతారని చెప్పాలి. మొన్నటివరకు నితీశ్ కొడుకు నిశాంత్ కుమార్ ప్రత్యక్షరాజకీయాల్లోకి వస్తున్నారని.. ఆయనకు రాజ్యసభ సీటు కేటాయిస్తారన్నప్రచారం జరిగింది. అందుకు భిన్నంగా కమలనాథుల కొత్త ప్లాన్ తో మొత్తం బిహార్ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రమే మారిపోతుందని చెబుతున్నారు.
కమలనాథుల తాజా ఆలోచనల ప్రకారం సీఎం నితీశ్ కొడుకును ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టటం.. అందుకు బదులుగా నితీశ్ చేతి నుంచి సీఎం పదవిని బీజేపీ నేతకు అప్పజెప్పటం.. తర్వాతి రోజుల్లో రాజ్యైసభ పదవిని అప్పగించటం ద్వారా బిహార్ నుంచి ఢిల్లీకి బదిలీ చేయాలన్న ఆలోచనలో బీజేపీ నేతలు ఉన్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
దీనికి సంబంధించిన కీలక ఒప్పందం ఢిల్లీలో జరిగినట్లుగా చెబుతున్నారు. ఒకవేళ.. అదే జరిగితే జేడీయూకి షాకింగ్ గా మారుతుందని చెప్పాలి. గత ఏడాది బిహార్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయాన్ని సాధించటం.. ఆ సందర్భంగా సీఎం పదవిని బీజేపీ సొంతం చేసుకుంటుందని ప్రచారం జరిగినా.. నితీశ్ ను ముఖ్యమంత్రి పదవిని సొంతం చేసుకున్నారు. పరిస్థితులు కుదటపడిన తాజా పరిస్జితుల్లో తన మాస్టర్ ప్లాన్ ను తెర మీదకు తీసుకురావటం ద్వారా.. బిహార్ పీఠంపై కాషాయ జెండా ఎగిరేలా ప్లానింగ్ తుదిదశకు చేరుకుందన్న మాట వినిపిస్తోంది.