ఇదేనా నువ్వు చెప్పిన `లిక్కర్ బ్యాన్`.. అంటూ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్(jagan)పై మంత్రి నారా లోకేష్(lokesh) ఫైరయ్యారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి(liquor scam) సంబంధించి తాజాగా ఎన్ఫోర్స్మెంటు డైరెక్టరేట్ అధికారులు పలువురు నిందితుల ఆస్తులను అటాచ్ చేస్తున్నారు. శుక్రవారం ఏకంగా 441 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేశారు. ఇంకామరింత మంది ఆస్తులను కూడా అటాచ్ చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం.. నాటి మద్యం అక్రమాల కేసు విచారణ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇంత జరుగుతున్నా.. వైసీపీ అధినేతగా, నాటి ముఖ్యమంత్రిగా జగన్ ఎందుకు స్పందించడం లేదని నారా లోకేష్ ప్రశ్నించారు. ఒకవైపు ఆస్తులు అటాచ్ అవుతున్నా యని.. మరోవైపు కీలక నిందితులు అడ్డంగా దొరికి పోతున్నారని.. అయినా జగన్ మౌనం పాటించడం ఏంటని ప్రశ్నించారు. వాస్తవానికి వైసీపీ హయాంలో మద్య నిషేధం చేసి.. ప్రజలను మద్యం బారి నుంచి బయట పడేస్తామని జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
కానీ, ఆనాడు.. మద్యం నిషేధించకపోగా.. మరింత ఎక్కువ ధరలు పెంచి.. నాసిరకం మద్యాన్ని ప్రజలకు విక్రయించి వారి ప్రాణాలు తీశారని.. దుయ్యబట్టారు. అదేసమయంలో మద్యం కంపెనీలనుంచి వేల కోట్ల రూపాయల ముడుపులు కూడా తీసుకున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఈడీ.. అధికారులు వందల కోట్ల రూపాయలను అటాచ్ చేస్తున్నారని.. దీనిపై జగన్ సమాధానం చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. కానీ.. జగన్ మౌనంగా ఉన్నారన్నారు. ``మౌనమే సమాధానమా జగన్`` అని ఎద్దేవా చేశారు.
అన్నింటిపైనా..
నాటి ప్రభుత్వంలో జరిగిన అన్ని అక్రమాలు, అవినీతిపైనా దర్యాప్తు చేస్తామని ఇటీవల సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయా న్ని లోకేష్ గుర్తు చేశారు. అన్నీ చట్టబద్ధంగానే సాగుతాయన్నారు. అంతేకాదు.. అక్రమంగా అర్థరాత్రి పూట, పుట్టిన రోజు నాడు.. తీసుకువెళ్లికస్టడీలో టార్చర్ చేసే ప్రభుత్వం కాదని వ్యాఖ్యానించారు. చట్టబద్ధంగా అన్ని అక్రమాలను విచారించి.. నిందితులను ప్రజల ముందు నిలబడెతామని చెప్పారు. నాడు యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చినట్టు లోకేష్ తెలిపారు.