అంతర్జాతీయ మహిళా దినోత్సవం(international women's day) సందర్భంగా అమరావతిలోని పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు(cm chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్, తాను కలిసి మహిళల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని అన్నారు. సృష్టికి మూలం మహిళ అని, ప్రేమ, త్యాగం, కష్టానికి ప్రతిరూపం స్త్రీ అని చెప్పారు. తెలుగింటి ఆడబిడ్డలకు, దేశంలోని మహిళలందరికీ శుభాకాంక్షలు(wishes) తెలిపారు. ముఖ్యమంత్రిగానే కాకుండా ఒక అన్నగా, తండ్రిగా ఆడబిడ్డలను ప్రోత్సహించి ఉన్నత స్థానాలకు తీసుకువెళ్లేందుకు సర్వశక్తులూ ఒడ్డుతానని హామీ ఇచ్చారు.
డ్వాక్రా, మెప్మా సంఘాలకు పూర్వ వైభవం తెస్తామని తెలిపారు. తెలుగింటి ఆడబిడ్డలు తయారుచేసే వస్తువులకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో 'స్వయం' బ్రాండ్ను ప్రారంభించామన్నారు. ఈ బ్రాండ్కు తానే బ్రాండ్ అంబాసిడర్ అని, నాణ్యత, ప్యాకేజింగ్, టెక్నాలజీలో ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. 84 లక్షల మందికి పైగా డ్వాక్రా సభ్యులను ఆర్థికంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే తమ సంకల్పమని స్పష్టం చేశారు.
మహిళలు తయారు చేసే స్వయం బ్రాండ్ వస్తువులను వారే వినియోగించుకుంటే దాదాపు మూడున్నర కోట్ల మంది వినియోగదారులు ఏర్పడతారని, ఇది మార్కెటింగ్కు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు.
దేశానికి రాష్ట్రపతిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము, ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్, రాష్ట్ర హోం మంత్రిగా అనిత సమర్థవంతంగా పనిచేస్తున్నారని అన్నారు. వచ్చిన ఆదాయాన్ని సమర్థంగా వినియోగించి కుటుంబాన్ని నడిపే మహిళలే నిజమైన ఆర్థిక మంత్రులని చంద్రబాబు అభివర్ణించారు.