మహిళలు అన్ని రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని విద్యార్థినులకు రేవంత్ రెడ్డి తీపి కబురందించారు. చదువుకునే ఆడబిడ్డల కోసం వారికి ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఈ ఉచిత స్కూటీల పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్ను కాలుష్యరహితనగరంగా, గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. 2026 డిసెంబర్ నాటికి హైదరాబాద్లో 100 శాతం ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తామన్నారు. డిసెంబర్ 9వ తేదీలోపు నగరంలో డీజిల్ బస్సులు కనిపించవని అన్నారు. నగరంలో తిరిగే పెట్రోల్, డీజిల్ ఆటోలను కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుస్తామని చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలుపై 'జీరో ట్యాక్స్' విధిస్తామన్నారు. అంతేకాదు, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను వెలుపలికి తరలిస్తామని ప్రకటించారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా మీడియా నిలుస్తోందని, ఆ వారధికి సారథులుగా ఉన్న మహిళా జర్నలిస్టులను సత్కరించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. సీనియర్ మహిళా జర్నలిస్టులను ఆయన ఘనంగా సత్కరించారు.