మహిళలకు అన్నింటా స్వేచ్ఛ కల్పిస్తున్నామని చెబుతున్నా.. అది ఒట్టిమాటగానే నిలబడి పోతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు.. మాజీ ఎమ్మెల్సీ కవిత(ex mlc kavita) అన్నారు. ``అది ఏం ఇంట్లో అయినా.. మహిళలపై వివక్ష కొనసాగుతోంది.`` అంటూ.. పరోక్షంగా ఆమె తన కుటుంబ సమస్యను ప్రస్తావించారు. ``చిన్న, పెద్ద కుటుంబాలు అనే తేడా లేదు. అన్న, నాన్న.. అన్న మాటే లేదు. ఏ ఇంట్లో పుట్టినా.. మహిళలకు వివక్ష తప్పడం లేదు. ఇది చాలా బాధాకరం. ఆవేదన చెందాల్సిన పరిస్థితి`` అని వ్యాఖ్యానించారు.
ఎక్కడా ఎవరి పేరును ఆమె ప్రస్తావించలేదు. మహిళల విషయంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసింది ఏమీ లేదని విమర్శించా రు. పైగా మహిళలపై నేరాలు, ఘోరాలు మరింతగా పెరిగాయని వ్యాఖ్యానించారు. ``మహిళా దినోత్సవం రోజే కాదు.. ప్రతిరోజు మహిళలను గౌరవించాలి`` అని కవిత పిలుపునిచ్చారు. 33 శాతం మహిలా రిజర్వేషన్లు సాధించిన ఘనత తెలంగాణ జాగృతిదేనని పేర్కొన్నారు.
మహిళలకు అండగా నిలవడం కాదని.. మహిళలకు ఎదిగేందుకు అవకాశం(స్పేస్) ఇవ్వాలని కవిత సూచించారు. ``ఇవాళ రేపు స్టాండ్ విత్ హర్ అనే మాట వినిపిస్తోంది. అదికాదు కావాల్సింది.. గివ్ హర్ స్పేస్(ఆమెకు అవకాశం ఇవ్వండి) అనేది కావాలి. ఈ దిశగానే మహిళలను, సమాజాన్ని కూడా చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది.`` అని కవిత వ్యాఖ్యానించారు. `గివ్ హర్ స్పేస్` పేరిట పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు.
తెలంగాణ ఉద్యమానికి మహిళలే ఊపిరిలూదారని తెలిపారు. సాయుధ రైతాంగ పోరాటానికి.. కూడా మహిళ ఐలమ్మ ఊపిరినిచ్చారని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు మహిళలకు అనేక అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దీనికి వయసుతో సంబంధం లేదన్నారు. ఎక్కువ మంది మహిళలు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. మహిళలకు అండగా జాగృతి నిలబడుతుందన్నారు. పార్టీలోనూ మహిళలకు పెద్ద ఎత్తున అవకాశం కల్పిస్తామన్నారు. చదువు, వయసుతో సంబంధం లేకుండా.. రాజకీయాల్లోకి రావాలని మహిళలకు సూచించారు.