దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల(5 states)(ఒకటి అసెంబ్లీ ఉన్న కేంద్రపాలిత ప్రాంతం)కు ఎన్నికల(elections) నగారా మోగింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. ఆయా రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను దశల వారీగా వెలువరించనుంది. ఈ మేరకు తాజాగా ఆదివారం.. కేంద్ర ఎన్నికల సంఘం(election commission of India) షెడ్యూల్ ప్రకటించింది.
1. అస్సాం: మొత్తం అసెంబ్లీ స్థానాలు: 126, పోలింగ్ తేదీ- ఏప్రిల్ 9. కౌంటింగ్ తేదీ మే 4. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ. ఇక్కడ బలమైన ప్రతిపక్షంగా స్థానిక పార్టీలు ఉన్నప్పటికీ.. పెద్దగా పోరాడే పరిస్థితి కనిపించడంలేదని విశ్లేషకులు చెబుతున్నారు.
2. తమిళనాడు: మొత్తం అసెంబ్లీ స్థానాలు:240, పోలింగ్ తేదీ- ఏప్రిల్ 23; కౌంటింగ్ తేదీ- మే 4. ప్రస్తుతం డీఎంకే పార్టీ అధికారంలో ఉంది. సీఎం స్టాలిన్ నేతృత్వంలో ఈ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అయితే.. ప్రస్తుతం రాజకీయంగా రాష్ట్రంలో వాడి వేడి పరిస్థితి నెలకొంది. బీజేపీ వ్యూహాత్మకంగాపావులు కదుపుతోంది. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఈ రాష్ట్రానికి చెందినవారే కావడం గమనార్హం. తాజాగా ఈ స్టేట్కే చెందిన ప్రముఖ రచయిత వైరముత్తుకు జ్ఞాన పీఠ్ అవార్డును కూడా ప్రకటించడం ఎన్నికలకు ముందు ఆసక్తిగా మారింది.
3. పశ్చిమ బెంగాల్: మొత్తం స్థానాలు 294.(అతి పెద్దరాష్ట్రం ఇదే). ఇక్కడ 2 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గత ఐదేళ్ల కిందట ఇక్కడ 7 దశల్లో ఎన్నికలు నిర్వహించారు.ఇక, తాజా షెడ్యూల్ ప్రకారం.. పోలింగ్ తేదీ- ఏప్రిల్ 23 (మొదటి దశ), ఏప్రిల్ 29 (2వ దశ); కౌంటింగ్ తేదీ- మే 4. కాగా.. అధికార పార్టీ టీఎంసీ దూకుడుగా ఉన్నప్పటికీ.. మూడు సార్లు ఇప్పటికే మమతను గెలిపించిన ఇక్కడి ప్రజలకు ఈ దఫా బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా మారింది. ఇక్కడ మరోసారి మమత గెలుపు అంటే.. ఏదైనా పెద్ద చిత్రం జరిగితే తప్ప సాకారం అయ్యేది కాదన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
4. కేరళం: మొత్తం అసెంబ్లీ స్థానాలు 140. పోలింగ్ తేదీ- ఏప్రిల్ 9; కౌంటింగ్ తేదీ- మే 4. ఇక్కడ కమ్యూనిస్టుల ప్రభావం ఉన్నప్పటికీ.. ఇటీవల తిరువనంతపురం సహా.. పలు స్థానిక ఎన్నికలలో బీజేపీ పుంజుకుంది. ఈ ప్రభావం ఉండే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి.
5. పుదుచ్చేరి( కేంద్ర పాలిత ప్రాంతం) మొత్తం స్థానాలు 30. పోలింగ్ తేదీ- ఏప్రిల్ 9; కౌంటింగ్ తేదీ- మే 4. ఇక్కడ బీజేపీతో భాగస్వామ్య పక్షంగా ఉన్న ఆల్ ఇండియా ఎన్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తిరిగి తమ స్థానం నిలబెట్టుకునేందుకు ఈ కూటమి ప్రయత్నిస్తోంది.