తెలంగాణ రాజకీయాల్లో మల్లారెడ్డి అంటేనే ఒక సెన్సేషన్. ఆయన మాట్లాడినా వార్తే.. మౌనంగా ఉన్నా వార్తే. బీఆర్ఎస్ ఓటమి తర్వాత మల్లారెడ్డి కారు దిగి కాంగ్రెస్ చెయ్యి అందుకుంటారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ, తాజాగా అసెంబ్లీ సాక్షిగా ఆయన ఇచ్చిన క్లారిటీతో సీన్ ఒక్కసారిగా రివర్స్ అయిపోయింది. ``నేను మునిగిపోయే పడవ ఎక్కను`` అంటూ కాంగ్రెస్పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న రూమర్లకు మల్లారెడ్డి తనదైన శైలిలో ఫుల్స్టాప్ పెట్టారు. ``నాకు 73 ఏళ్లు.. ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో నాకు బాగా తెలుసు`` అంటూ గంభీరంగా చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డిని కలిసింది కేవలం తన పెళ్లి రోజు వేడుకలకు ఆహ్వానం పలకడానికే అని, అంతకు మించి ఏ రాజకీయ ప్రాధాన్యత లేదని కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ పార్టీని మునిగిపోయే నావతో పోల్చిన ఆయన, బీఆర్ఎస్ వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
అయితే మల్లారెడ్డి కాంగ్రెస్కు నో చెబుతుంటే, ఆయన కోడలు ప్రీతి రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికొత్త చర్చకు దారితీశాయి. ఆమె ప్రధాని మోదీ నాయకత్వాన్ని ఆకాశానికెత్తడమే కాకుండా, హైదరాబాద్ పేరును `భాగ్యనగర్`గా మార్చాలన్న బీజేపీ డిమాండ్కు మద్దతు తెలపడం అందరినీ ఆశ్చర్యపరిచింది. గతంలో బండి సంజయ్తో భేటీ అయిన ఫోటోలు కూడా ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చాయి. దీంతో మల్లారెడ్డి కుటుంబం ప్లాన్ బి సిద్ధం చేసుకుందా? అనే అనుమానాలు మొదలయ్యాయి.
ఒకే ఫ్యామిలీ.. రెండు పార్టీలా?
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మల్లారెడ్డి బీఆర్ఎస్లో ఉంటూనే, తన ఫ్యామిలీ నుంచి ఒకరిని బీజేపీ వైపు పంపే ఆలోచనలో ఉన్నారా? అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్తో వైరం ఉన్న నేపథ్యంలో, సేఫ్ సైడ్ ఉండటానికి బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారా? అన్నది మిస్టరీగా మారింది. ఏది ఏమైనా, మల్లారెడ్డి ఫ్యామిలీలో ఈ పొలిటికల్ హీట్ రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.