ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 6న అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని కేంద్రం చట్టబద్ధంగా గుర్తించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం, 2026 ద్వారా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం పొందిన ఈ నోటిఫికేషన్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రజలందరికీ ఇది ఒక చరిత్రాత్మక విజయ క్షణం అని బాలయ్య భావోద్వేగానికి లోనయ్యారు. అమరావతి.. మన ఆత్మగౌరవానికి, మన భవిష్యత్తుకు ప్రతీక అని ఆయన అన్నారు. రాజధాని రైతుల త్యాగానికి, ప్రజల ఆశలకు లభించిన న్యాయం ఇదని చెప్పారు. అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడంలో తమ వంతు సహకారం అందించాలని ప్రజలందరికీ పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి చంద్రబాబు, బిల్లుకు మద్దతు ఇచ్చిన అన్ని పార్టీలకు బాలయ్య కృతజ్ఞతలు తెలిపారు.