సాధారణంగా రాజకీయాల్లోకి వస్తే పదవులు, హోదాలు, పవర్ వస్తాయని అందరూ అనుకుంటారు. కానీ, వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి ఆర్కే రోజా(RK Roja)కు మాత్రం పదవులతో పాటు మరికొన్ని అన్వాంటెడ్ గిఫ్ట్లు కూడా వచ్చాయట. నగరిలోని తన నివాసంలో వైసీపీ మాజీ సర్పంచ్ల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆమె, తన వ్యక్తిగత ఆరోగ్యంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ఎమ్మెల్యే సీటు తన జీవితంలో ఎలాంటి మార్పులు తెచ్చిందో ఆమె తనదైన శైలిలో వివరించారు.
రాజకీయం అంటేనే ఒత్తిడితో కూడుకున్న వ్యవహారం అని రోజా(Roja) కుండబద్దలు కొట్టారు. "మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు విజయోత్సాహంతో పాటు బీపీ కూడా వచ్చి చేరింది. ఇక రెండోసారి గెలిచాక ఆ సంతోషం కాస్తా షుగర్ వ్యాధిని తెచ్చిపెట్టింది" అంటూ చెప్పుకొచ్చారు. గెలిచిన ప్రతిసారి ప్రజా సమస్యల కోసం పోరాడుతూ తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టానన్న అర్థం వచ్చేలా ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.
కేవలం ఆరోగ్యం గురించే కాకుండా, గత ఎన్నికల ఫలితాలపై కూడా రోజా కామెంట్స్ చేశారు. కూటమి నేతల్లా తాము అబద్ధాలు చెప్పలేకే ఓడిపోయామని రోజా సెలవిచ్చారు. అయితే గత ఐదేళ్లుగా ప్రత్యర్థులపై ఆమె వాడిన భాష, అసెంబ్లీలో చేసిన విమర్శలు, ప్రెస్ మీట్లలో చూపించిన దూకుడును జనం ఇంకా మర్చిపోలేదు. కానీ, మేము చాలా పద్ధతిగా ఉన్నాం కాబట్టే జనం ఓడించారు అనే ఆమె లాజిక్ చూస్తుంటే.. ఆమె ఇంకా ఓటమి షాక్ నుంచి బయటకు రాలేదని అర్థమవుతోంది. ఇక పదవీకాలం ముగిసిన సర్పంచ్లను పిలిచి సన్మానం చేస్తూ, మళ్లీ స్థానిక సంస్థల్లో సత్తా చాటాలని రోజా పిలుపునిచ్చారు. వైసీపీ(YCP) సర్పంచ్లు ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లాలని ఈ సందర్భంగా సూచించారు.