జగన్ ను మరోసారి ఏకిపారేసిన షర్మిల

admin
Published by Admin — April 19, 2026 in Politics
News Image

అధికారంలో ఉన్నా, లేకున్నా...వైసీపీ(ycp) మాత్రం కేంద్రంలో ఎన్డీఏకు అన్ని వేళలా మద్దతిస్తూనే ఉందన్న సంగతి తెలిసిందే. తాజాగా లోక్ సభలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు(women reservation bill)తోపాటు డీలిమిటేషన్ బిల్లునకు కూడా వైసీపీ మద్దతిచ్చింది. అయితే, ఆ బిల్లు వీగిపోవడంతో వైసీపీ అధినేత జగన్ బాధపడుతూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ నేపథ్యంలోనే జగన్(jagan)పై ఆయన సోదరి షర్మిల మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. మోదీ(modi) దత్తపుత్రుడు జగన్ తెర మరోసారి తొలిగిపోయిందంటూ తన ఫేస్ బుక్ ఖాతాలో షర్మిల(sharmila) చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

"దత్తపుత్రుడు జగన్ గారి తెర తొలగింది. బీజేపీతో పెట్టుకున్న అక్రమపొత్తు తేటతెల్లమైంది. విపక్షం ముసుగులో ఉన్నది సైతం RSS పక్షమేనని నిజ నిర్ధారణ జరిగింది. TDP, జనసేనల కంటే మోడీ గారిని ఇంతలా మోయాలా? మన దేశ రాజ్యాంగ పరిరక్షణ కంటే బీజేపీ భజనే ముఖ్యమా ? అక్రమ డీ లిమిటేషన్ బిల్లులపై NDA పక్షాన నిలబడ్డందుకు YCP అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారు సిగ్గుపడాలి. మీ 5 ఏళ్ల పాలనలో చేసిన అవినీతి కోసం ఇంతలా బీజేపీతో అంటకాగాలా? కేసుల నుంచి రక్షణ కోసం బానిసగా బ్రతకాలా? బీజేపీ బిల్లులకు గొర్రెలా గుడ్డిగా తలాడించాలా ? మోదీ గారి మెప్పుకోసం సొంత కాకిలెక్కలు అల్లాలా?

ఇదేనా మీరు చెప్పే YSR ఆశయాలు, వారసత్వం ? మహానేత సిద్ధాంతాలను మంట గలిపినందుకు, విలువలకు తూట్లు పొడిచినందుకు జగన్ గారే ఆత్మవిమర్శ చేసుకోవాలి. రాజ్యాంగానికి విఘాతం కలిగించే అక్రమ బిల్లును విపక్షాలు అడ్డుపడి విజయం సాధిస్తే, ఏం సాధించారని ప్రశ్నించడం తీవ్ర హాస్యాస్పదం. దొంగ బిల్లులకు ఓటేసి ఇంతకు మీరేం సాధించారు? కోట్లాది AP రాష్ట్ర ప్రజల గుండెలు గాయపరచడమా మీరు సాధించిన గొప్పతనం.

దక్షిణాది రాష్ట్రాల బావోగ్వేదాన్ని అర్థం చేసుకోకపోవడమా మీ రాజకీయం ?ప్రతిపక్షంగా విపక్షానికి మద్దతు ఇవ్వాల్సింది పోయి అధికార పక్షానికి జై కొట్టడం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ? జగన్ గారు చేసిన నీచపు పనికి YSR ఆత్మ నిజంగా ఘోషిస్తోంది. మహిళా బిల్లును, డీ లిమిటేషన్ కి లింక్ పెట్టడం జగన్ గారి అవివేకానికి నిదర్శనం. న్యాయం జరగలేదని, సాకారం కాలేదని మీరే అంటున్నారా లేక మోడీ గారు మీచేత కూడా చెప్పించారా ? మహిళల 33 శాతం రిజర్వేషన్లకు ఎవరు వ్యతిరేకం కాదు. అవనికి అగ్రతాంబూలం అందిస్తుంటే అభ్యంతరం ఎవరికి లేదు. 

 
కాంగ్రెస్ పార్టీతో సహా దేశ వ్యాప్తంగా విపక్షాల ఐక్యత ఒకటే. మహిళా బిల్లు పాస్ అయ్యింది 2023 లోనే. అడ్డుకున్నది మోదీజీ లబ్ది కోసం పెట్టిన డీ లిమిటేషన్ బిల్లును మాత్రమే. నియోజకవర్గాల పునర్విభజనపై, మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ స్టాండ్ క్రిస్టల్ క్లియర్. 2026 జనాభా లెక్కలు అందుబాటులోకి రావాలి. కులగణన ద్వారా SC, ST, OBC ల సంఖ్య తేలాలి. కులాల ఆధారంగా డీ లిమిటేషన్ లో రిజర్వేషన్లు పాటించాలి. వెనుకబడిన కులాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించి న్యాయం చేయాలి. ప్రస్తుత 543 స్థానాలకు మహిళా రిజర్వేషన్లను పాటించాలి.

చిన్న రాష్ట్రాల వాదనలను పరిగణనలోకి తీసుకొని సమ్మతమైన పరిష్కారం చూపాలి. అధికారిక గణాంకాలు లేకుండా 50 శాతం పెంచి దేశాన్ని ఉద్ధరిస్తున్నామని బీజేపీ చెప్తే గుడ్డిగా జగన్ గారు సైతం నమ్మడం రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే. అందుకే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అంటే బాబు- జగన్ - పవన్. మూడు పార్టీలు మోడీ గారి మెప్పుకోరే పార్టీలే. ప్రతిపక్షం ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే." అనే షర్మిల తన ఫేస్బుక్ ఖాతాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
Tags
jagan ys sharmila women reservation bill congress nda pm modi
Recent Comments
Leave a Comment

Related News