వైసీపీ హయాంలో ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి హవా కొనసాగిన సంగతి తెలిసిందే. అప్పట్లో తాను ఒక ప్రభుత్వ ఉద్యోగి అన్న సంగతి కూడా మరిచిపోయి వైసీపీ కార్యకర్తలాగా ఆయన పనిచేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయనపై కూటమి ప్రభుత్వం వేటు వేసింది. వెంకట్రామిరెడ్డిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సర్వీసు నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలోనే ఆయనను తొలగించినట్లు తెలిపింది.
ఆ కారణంతోనే వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకున్నామని సాధారణ పరిపాలన శాఖ వెల్లడించింది. ప్రస్తుతం వెంకట్రామిరెడ్డి పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ విభాగంలో అసిస్టెంట్ సెక్రెటరీగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి రాజకీయాల్లో జోక్యం చేసుకున్నారని వెంకట్రామిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక, 2024 ఎన్నికల సందర్భంగా ప్రవర్తనా నియమావళిని ఆయన ఉల్లంఘించి వైసీపీ తరఫున ప్రచారం చేసినట్లు రుజువైంది. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం పేరుతో రాజకీయ ప్రయోజనాల కోసం పని చేశారని తేలింది. అది తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యమని, అందుకే ఆయనను తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించి రావాల్సిన ప్రయోజనాలను కూడా నిలిపివేస్తున్నామని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.