ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) సమగ్ర అభివృద్ధికి సరికొత్త బాటలు వేస్తూ రాష్ట్ర మంత్రుల బృందం సింగపూర్లో జరుపుతున్న పర్యటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. రెండో రోజు పర్యటనలో భాగంగా మంత్రులు అత్యంత కీలకమైన భేటీలు నిర్వహించడమే కాకుండా, ఏపీ భవిష్యత్తును మార్చే గట్టి పునాదుల కోసం కసరత్తు ప్రారంభించారు. ప్రధానంగా మహిళా రక్షణ, పట్టణాల రూపకల్పనలో సింగపూర్ అనుసరిస్తున్న గోల్డెన్ రూల్స్ రాష్ట్రంలో అమలు చేసే అవకాశాలను మంత్రులు పరిశీలించారు.
రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత(Vangalapudi Anitha) నేతృత్వంలోని బృందం సింగపూర్ హోంమంత్రి కె. షణ్ముగంతో ప్రత్యేకంగా సమావేశమైంది. ప్రపంచంలోనే అత్యంత తక్కువ నేరాల రేటు ఉన్న నగరాల్లో సింగపూర్ ఒకటి. అక్కడ శాంతిభద్రతలు ఎలా కాపాడతారు? టెక్నాలజీని ఎలా వాడుకుంటారు? అనే అంశాలపై మంత్రులు ఆరా తీశారు. ముఖ్యంగా మహిళల రక్షణ కోసం సింగపూర్ ఉపయోగిస్తున్న అధునాతన నిఘా వ్యవస్థలపై అనిత ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. ప్రతి వీధిలోనూ, ప్రతి సెకనులోనూ నిఘా నీడన ఉంచే టెక్నాలజీని ఏపీలో ప్రవేశపెట్టే దిశగా చర్చలు జరిగాయి.

పర్యటనలో మరో హైలెట్ అంశం.. మంత్రులంతా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (NUS)లో ప్రత్యేక శిక్షణకు హాజరుకావడం. పట్టణాల రూపకల్పనలో అత్యాధునిక విధానాలు, భూమి వినియోగంలో ఉండాల్సిన పారదర్శకతపై నిపుణులు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. మరీ ముఖ్యంగా నేషన్ ఫస్ట్ సిద్ధాంతాన్ని పాలనలో ఎలా అన్వయించుకోవాలనే అంశంపై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు. బాధ్యతాయుతమైన పాలన ద్వారా అభివృద్ధిని ప్రజల ముంగిటకు ఎలా తీసుకెళ్లాలో మంత్రులు అక్కడ అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్ర మంత్రుల ఈ 7 రోజుల పర్యటన కేవలం సందర్శన మాత్రమే కాదు.. ఏపీ అభివృద్ధికి కావాల్సిన ఒక బ్లూప్రింట్ను సిద్ధం చేయడం అని స్పష్టమవుతోంది. రాజధాని అమరావతి(Amaravati) నిర్మాణం మొదలుకొని, రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ వరకు సింగపూర్ తరహా ప్రమాణాలను ఇక్కడ అమలు చేయాలన్నదే ఈ పర్యటన వెనుక ఉన్న అసలు ఉద్దేశం. ఏదేమైనా సింగపూర్ క్రమశిక్షణ, అక్కడి టెక్నాలజీ రాష్ట్రంలో అడుగుపెడితే ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
