బెంగళూరు: ప్రేమ ఎంత మధురంగా ఉంటుందో, ఒక్కోసారి అంతకంటే భయంకరంగా మారుతుందని నిరూపించింది ఈ దారుణ ఘటన. ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు.. కలిసే పనిచేశారు.. కానీ ఆ ప్రేమే పెనుభూతమై ఒకరి ప్రాణం తీస్తే, మరొకరిని జైలు పాలు చేసింది. బెంగళూరు(Bengaluru)లోని అంజనానగర్లో చోటుచేసుకున్న ఈ కిరాతక ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
కిరణ్, ప్రేరణ(Prerana) ఇద్దరూ ఒకే మొబైల్ సర్వీస్ సెంటర్లో పని చేసేవారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే, గత కొద్దిరోజులుగా కిరణ్ తనను సరిగ్గా పట్టించుకోవడం లేదని, పెళ్లి చేసుకోకుండా ముఖం చాటేస్తాడేమోనన్న అనుమానం ప్రేరణలో మొదలైంది. ఆ అనుమానమే ఆమెను ఒక రాక్షసిలా మార్చేసింది. అతడిని అంతమొందించాలని నిశ్చయించుకున్న ప్రేరణ, ఎవరూ ఊహించని విధంగా ఒక భయంకరమైన స్కెచ్ వేసింది.
ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి కిరణ్(Kiran)ను రమ్మని పిలిచింది. "నీకు వెస్ట్రన్ స్టైల్లో ఒక స్పెషల్ ప్రపోజల్ ఇవ్వబోతున్నాను" అని నమ్మబలికింది. ప్రేయసి ఏదో సర్ప్రైజ్ ఇస్తుందని అమాయకంగా నమ్మిన కిరణ్, ఆమె చెప్పినట్లుగానే కుర్చీలో కూర్చున్నాడు. కళ్లకు గంతలు కట్టి, చేతులు కట్టేస్తున్నా అది ప్రేమలో భాగమే అనుకున్నాడు కానీ, తన పక్కనే మృత్యువు కిరోసిన్ రూపంలో ఉందన్న నిజాన్ని పసిగట్టలేకపోయాడు.
కిరణ్ను కుర్చీకి కట్టేసిన వెంటనే ప్రేరణ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టింది. వెంట తెచ్చుకున్న కిరోసిన్ను అతడిపై కుమ్మరించి నిప్పు పెట్టింది. మంటల్లో చిక్కుకున్న కిరణ్ హాహాకారాలు చేస్తున్నా, కనీసం మనసు కరగలేదు సరికదా.. ఆ దారుణ దృశ్యాన్ని తన సెల్ఫోన్లో వీడియో తీస్తూ రాక్షస ఆనందం పొందింది. తీవ్ర గాయాలపాలైన కిరణ్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బైదరహళ్లి పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనుమానం ఒక నిండు ప్రాణాన్ని ఎలా బలితీసుకుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం.