బహుముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల రామలక్ష్మణులపై చేసిన కొన్ని వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని ఆగ్రహానికి గురిచేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ఇష్యూపై రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి(BJP Chief Vanipally Srinivas Reddy) స్పందిస్తూ.. ప్రకాశ్రాజ్ను తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రకాశ్ రాజ్ తీరుపై విరుచుకుపడ్డ ఆయన, ఏకంగా ప్రాణహాని తలపెట్టేలా తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది
ప్రకాశ్ రాజ్(Prakash Raj) గత కొంతకాలంగా హిందూ ధర్మంపై, దేవుళ్లపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారని మండిపడ్డ శ్రీనివాస్ రెడ్డి, తాజా వ్యాఖ్యలతో ఆయన హద్దులు దాటారని పేర్కొన్నారు. "శ్రీరాముడు, లక్ష్మణుడిని కించపరిచేలా మాట్లాడిన ప్రకాశ్ రాజ్కు ఈ సమాజంలో బ్రతికే అర్హత లేదు. ఆయన ఎక్కడ కనిపిస్తే అక్కడ తల నరికేయాలి. ఎవరు ఆ పని చేసినా ఆ బాధ్యత నేను తీసుకుంటాను" అంటూ బహిరంగంగానే సవాల్ విసిరారు. నాస్తికుడి ముసుగులో ప్రకాశ్ రాజ్ హిందూ సంస్కృతిపై విషం చిమ్ముతున్నారని ఆయన ధ్వజమెత్తారు.

కేవలం హెచ్చరికలతోనే ఆగకుండా, సినీ పరిశ్రమలోని పెద్దలను కూడా శ్రీనివాస్ రెడ్డి ఈ వివాదంలోకి లాగారు. పవన్ కల్యాణ్, బాలకృష్ణ(Balakrishna) వంటి అగ్ర హీరోలు చొరవ తీసుకుని ప్రకాశ్ రాజ్ను టాలీవుడ్ నుంచి తరిమికొట్టాలని డిమాండ్ చేశారు. "దిల్ రాజు వంటి నిర్మాతలు ఆయనకు ఇకపై అవకాశాలు ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే, షూటింగ్ స్పాట్ల వద్దే దాడులు చేస్తాం. 'మా' (MAA) అసోసియేషన్ ఈ విషయంలో కఠిన నిర్ణయం తీసుకోవాలి" అని స్పష్టం చేశారు. వినోదం పేరుతో దేవుళ్లను జోకర్లుగా చూపించే రోజులు పోయాయని, ఇది నయా భారత్ అని ఆయన హెచ్చరించారు.
గతంలోనూ ప్రకాశ్ రాజ్ రాజకీయాలపై, సనాతన ధర్మంపై చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చలకు దారితీసేవి. అయితే, ఈసారి ఏకంగా ఒక రాజకీయ పార్టీ జిల్లా స్థాయి నేత తల నరికేస్తాం అని ప్రకటించడంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి(Srinivas Reddy) చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వ్యవహారంపై ప్రకాశ్ రాజ్ ఎలా స్పందిస్తారు? సినిమా ఇండస్ట్రీ ఈ హెచ్చరికలను ఎలా పరిగణనలోకి తీసుకుంటుంది? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.