ఏపీలో బంకుల మూత‌.. ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న‌!

admin
Published by Admin — April 26, 2026 in Andhra
News Image

అమరావతి: గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో పెట్రోల్, డీజిల్ లభ్యతపై వస్తున్న వార్తలు వాహనదారులను కలవరపెడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తుండటంతో, సామాన్యులు ఆందోళనతో బంకుల వద్ద క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ.. రాష్ట్రంలో ఇంధన నిల్వలకు ఎలాంటి కొరత లేదని, ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని స్పష్టమైన హామీ ఇచ్చారు.

కొందరు వ్యాపారులు కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. డిపోల వద్ద నిల్వలు పుష్కలంగా ఉన్నప్పటికీ, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడే ఉద్దేశంతో కొన్ని బంకులను మూసివేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం సరఫరా వ్యవస్థలో చిన్నపాటి లోపాల వల్ల కొన్నిచోట్ల అంతరాయం కలిగి ఉండవచ్చని, దానిని సాకుగా చూపి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రైవేట్ అవుట్‌లెట్లతో సహా అన్ని బంకుల్లో తనిఖీలు చేపట్టాలని జిల్లా అధికారులను నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) ఆదేశించారు.

ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) అత్యంత సీరియస్‌గా తీసుకున్నారు. రాష్ట్రంలో అసలు ఎన్ని బంకులు మూతపడ్డాయి? సరఫరా ఎక్కడ నిలిచిపోయింది? అనే అంశాలపై సమగ్ర నివేదికను సాయంత్రంలోగా సమర్పించాలని అధికారులకు డెడ్ లైన్ విధించారు. ప్రభుత్వం కల్పించుకోవడంతో క్షేత్రస్థాయిలో పరిస్థితి వేగంగా మారుతోంది. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా బంకుల వద్ద పోలీసుల నిఘాను కూడా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

బిజెపి(BJP) రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి కూడా ఈ అంశంపై గళమెత్తారు. కొన్ని ఏజెన్సీలు కావాలనే గందరగోళం సృష్టిస్తున్నాయని, ఆకస్మిక తనిఖీలు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం కావడంతో, ఇకపై పెట్రోల్, డీజిల్ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి, వాహనదారులు పానిక్ కావాల్సిన పనిలేదని ప్రభుత్వం భరోసా ఇస్తోంది.

Tags
Andhra Pradesh AP Fuel Update Petrol Shortage Chandrababu Naidu Nadendla Manohar AP News
Recent Comments
Leave a Comment

Related News