సినీ నటి, సోషల్ మీడియా స్టార్ అషు రెడ్డి చుట్టూ వివాదాల ముసురు ముదురుతోంది. పెళ్లి పేరుతో ఎన్నారై ధర్మేంద్ర(NRI Dharmendra)ను నమ్మించి సుమారు రూ. 9.5 కోట్లు కాజేసిందనే ఆరోపణలతో ఇప్పటికే ఆమెపై FIR నమోదైన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో తాజాగా బయటకు వచ్చిన కొన్ని ఆడియో రికార్డింగ్స్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ కాల్ రికార్డింగ్స్లో అషు రెడ్డి బాధితుడిని బెదిరించిన తీరు చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.
లీక్ అయిన ఆడియో క్లిప్స్లో అషు రెడ్డి(Ashu Reddy) బాధితుడు ధర్మేంద్రకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తాను తీసుకున్న మొత్తంలో కేవలం కోటిన్నర రూపాయలు మాత్రమే ఇప్పుడు ఇస్తానని, అందుకు మే వరకు టైమ్ ఇవ్వమని డిమాండ్ చేసింది. మిగిలిన డబ్బు కావాలంటే తాను జీవితంలో సెటిల్ అయ్యే వరకు వేచి చూడాలని స్పష్టం చేసింది. ఒకవేళ ఒత్తిడి చేస్తే మాత్రం ఎదురు దాడికి దిగుతానని, తన పేరెంట్స్ను ఇబ్బంది పెడుతున్నావంటూ వేధింపుల కేసు పెడతానని ఓపెన్ వార్నింగ్ ఇచ్చింది. నేను చెప్పినట్టు వింటేనే నీకు డబ్బులు వస్తాయి.. లేదంటే ఇబ్బందులు తప్పవు అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఈ వివాదాన్ని సద్దుమణిగించేందుకు అషు రెడ్డి ఒక వింతైన ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఈ మ్యాటర్ గురించి నేరుగా మాట్లాడటం తనకు ఇష్టం లేదని చెబుతూనే.. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి(Venu Swamy), సీరియల్ నటి ప్రవీణ అనే వ్యక్తుల మధ్యవర్తిత్వంతో రాజీ చేసుకుందామని ఆఫర్ ఇచ్చింది. పెద్ద మనుషుల సమక్షంలో సెటిల్మెంట్ చేసుకుంటేనే మిగిలిన డబ్బు గురించి ఆలోచిస్తానని ఆమె పేర్కొనడం గమనార్హం. అసలు బాధితుడి ముఖం చూడటం కూడా ఇష్టం లేదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోస్తున్నాయి.
ఈ కేసులో అషు రెడ్డి(Ashu Reddy) తల్లి ప్రస్తావన కూడా రావడం గమనార్హం. ధర్మేంద్రకు చెందిన కారును అషు రెడ్డి తల్లి తీసుకువెళ్లి ప్రమాదానికి గురిచేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ధర్మేంద్రకు ఆమె సారీ చెబుతున్న ఆడియోలు కూడా ఇప్పుడు పోలీసుల చేతికి చిక్కాయి. ఒకవైపు అషు రెడ్డి బెదిరింపులు, మరోవైపు ఆమె తల్లి క్షమాపణలు.. కలిసి ఈ కేసును ఒక హై ఓల్టేజ్ డ్రామాలా మార్చాయి. ఈ ఆడియో సాక్ష్యాలతో పోలీసులు అషు రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.