సినిమా ఇండస్ట్రీ(Film Industry)లో సక్సెస్ ఉంటేనే క్రేజ్ ఉంటుంది.. క్రేజ్ ఉంటేనే భారీ రెమ్యూనరేషన్ ఉంటుంది. ఇది ఇన్నాళ్లూ ఇండస్ట్రీ ఫాలో అవుతున్న లెక్క. కానీ, ఇప్పుడు ఒక స్టార్ హీరో మాత్రం ఈ లెక్కలన్నింటినీ తలకిందులు చేస్తున్నారు. వరుస పరాజయాలు పలకరిస్తున్నా, బాక్సాఫీస్ వద్ద తన సినిమా బోల్తా కొట్టినా.. పారితోషికం విషయంలో మాత్రం అస్సలు తగ్గడం లేదు. తాజాగా ఆయన డిమాండ్ చేసిన అంకె విని ఇండస్ట్రీ వర్గాలు అవాక్కవుతున్నాయి.
సాధారణంగా ఏ హీరోకైనా ఒక సినిమా ఫ్లాప్ అయితే తన తర్వాతి సినిమాకు మార్కెట్ తగ్గుతుంది. కానీ కోలీవుడ్కు చెందిన ఓ అగ్ర హీరో విషయంలో ఇది రివర్స్లో జరుగుతోంది. 2025 ఆరంభంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఆయన సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ వెంటనే వచ్చిన మరో చిత్రం కూడా కనీస వసూళ్లను సాధించలేకపోయింది. దీంతో ఆయన మార్కెట్ పడిపోయిందని అందరూ అనుకుంటున్న తరుణంలో, సదరు హీరో తన తదుపరి ప్రాజెక్ట్ కోసం ఏకంగా రూ. 170 కోట్లు డిమాండ్ చేసినట్లు కోలీవుడ్(Kollywood) మీడియా కోడై కూస్తోంది.
సదరు హీరోకు ఉన్న మాస్ ఇమేజ్ చూసి కథ చెప్పడానికి వెళ్లిన ఒక ప్రముఖ నిర్మాణ సంస్థకు ఆయన కోట్ చేసిన రెమ్యూనరేషన్(Remuneration) విని మైండ్ బ్లాక్ అయిందట. "గత సినిమాకే రూ. 160 కోట్లు తీసుకున్నాను.. ఇప్పుడు అంతకంటే ఎక్కువే ఉండాలి కానీ తగ్గే ప్రసక్తే లేదు" అని హీరో భీష్మించుకుని కూర్చున్నట్లు సమాచారం. ఈ డిమాండ్ విన్న నిర్మాతలు, బయట ఆయన మార్కెట్ పరిస్థితి ఏంటో ఆయనకు ఎవరైనా చెబితే బాగుంటుందని లోలోపల వాపోయారట. వరుస ఫ్లాపులతో ఉన్న హీరోకి ఇంత భారీ మొత్తాన్ని ఇస్తే, ఇక సినిమా బడ్జెట్ ఎక్కడికి చేరుతుందో అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఇక ఈ వార్తల్లో వినిపిస్తున్న పేరు కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్(Ajith Kumar). 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా తర్వాత ఆయన నుంచి మరో ప్రాజెక్ట్ అనౌన్స్ కాలేదు. గత కొంతకాలంగా షూటింగ్స్కు బ్రేక్ ఇచ్చి ప్రొఫెషనల్ రేసింగ్లో బిజీగా గడుపుతున్న అజిత్, త్వరలో అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కకపోవడానికి ఈ రెమ్యూనరేషన్ గొడవలే కారణమని గుసగుసలు వినిపిస్తున్నాయి.