తమిళనాడు రాజకీయ క్షేత్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మార్మోగిపోతోంది. ఆయనే టీవీకే (TVK) అధినేత, సినీ నటుడు దళనతి విజయ్. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న రాజకీయ సమీకరణాలను బట్టి చూస్తే, కోట్లాది మంది అభిమానులు ఆయన్ని కాబోయే ముఖ్యమంత్రిగా భావిస్తున్నారు. అయితే, విజయ్ ఎదుగుదలపై ఎంత చర్చ జరుగుతుందో, ఆయన వ్యక్తిగత నేపథ్యం, మూలాల గురించి అంతే స్థాయిలో ఇంటర్నెట్లో సెర్చ్ జరుగుతోంది. ఈ క్రమంలో బయటపడ్డ కొన్ని విషయాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి.
సాధారణంగా ఒక వ్యక్తి ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పుడు, ఆయన పూర్వీకులు ఎవరు? ఏ ప్రాంతానికి చెందిన వారు? అనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. విజయ్ విషయంలో కూడా ఇదే జరిగింది. తాజాగా రాజకీయ విశ్లేషకులు వెల్లడించిన వివరాల ప్రకారం.. విజయ్ మూలాలు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని చిత్తూరు జిల్లాలో ఉన్నాయని తెలుస్తోంది. విజయ్ తాతగారి స్వగ్రామం చిత్తూరు జిల్లాలోని తల్లపల్లి ప్రాంతమని, ఉపాధి నిమిత్తం ఆయన అక్కడి నుండి రామేశ్వరం వెళ్లి స్థిరపడ్డారని సమాచారం. అంటే విజయ్ తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్ వారసత్వం కూడా తెలుగు నేలతోనే ముడిపడి ఉందన్నమాట.
నేటి రాజకీయాల్లో కులం అనేది ఒక ప్రధాన అంశంగా మారిన తరుణంలో, విజయ్(Vijay) నేపథ్యంపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. అయితే, విజయ్ తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ తన కుమారుడిని పాఠశాలలో చేర్పించే సమయంలో కులం కాలమ్లో కేవలం 'తమిళన్' అని మాత్రమే రాయించారట. ఏ కులానికో, మతానికో అతీతంగా ఒక గుర్తింపును ఇవ్వాలనే అప్పట్లోనే ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కానీ, విశ్లేషకుల లోతైన పరిశోధనలో ఆయన మూలాలు తెలుగువే అని తేలడంతో, చిత్తూరు జిల్లా వాసులు విజయ్ మనవాడే అని గర్వంగా చెప్పుకుంటున్నారు.
ఒకవేళ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే, చిత్తూరు జిల్లా ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరినట్టే. ఎందుకంటే ఇప్పటికే ఈ జిల్లా నుండి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసి జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్నారు. అలాగే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ జిల్లా నుండే ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు విజయ్ కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తే, చిత్తూరు గడ్డ నుండి వచ్చిన మూడో ముఖ్యమంత్రిగా ఆయన చరిత్ర సృష్టిస్తారు.