తమిళనాడు ముఖ్యమంత్రిగా గత ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన టీవీకే అధిపతి విజయ్.. తాజాగా బుధవారం బల పరీక్షను నిరూపించుకున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు.. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ విజయ్కు అవకాశం కల్పించారు. ఈ క్రమంలోనే ఈ నెల 13(బుధవారం) విశ్వాస పరీక్షను నెగ్గాలని.. బలాన్ని నిరూపించుకోవాలని విజయ్కు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో బుధవారం బల పరీక్ష జరిగింది.
సభకు హాజరైన వారిలో విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే సభ్యులు లేచి నిలబడడం ద్వారా.. ఓటింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఊహించని రీతిలో 144 మంది సభ్యులు ప్రభుత్వానికి మద్దతుగా నిలబడ్డా రు. దీంతో స్పీకర్.. విశ్వాస పరీక్షలో విజయ్ సర్కారు నెగ్గిందంటూ.. వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఓటింగ్ ప్రతిని, మద్దతు ఇచ్చిన సభ్యుల పేర్లు, సంతకాలను కూడా అధికారులు నమోదు చేశారు. దీనిని గవర్నర్ కార్యాలయానికి పంపించనున్నారు. దీంతో విజయ్ విశ్వాస పరీక్ష విజయవంతంగా పూర్తయింది.
ఎవరెవరు..
ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీవీకేకు సొంతంగా 108 సీట్లు దక్కాయి. అయితే.. వీటిలో రెండు చోట్ల విజయ్ విజయం దక్కించుకోవడం.. ఒక సీటుకు రాజీనామా కూడా సమర్పించడంతో 107 మంది సభ్యులు మాత్రమే మిగిలారు. కానీ, వీరిలో ఒకరు కేవలం 1 ఓటు తేడాతో విజయం దక్కించుకోవడంతో ఆయనను లెక్కలోకి తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. దీంతో సదరు ఎమ్మెల్యేను పక్కన పెట్టగా.. విజయ్ బలం 106కు చేరుకుంది. ఈ పార్టీకి.. సీపీఎం 2, సీపీఐ 2, యూఐఎం.ఎల్ పార్టీ 2, కాంగ్రెస్ పార్టీ 5 స్థానాల్లో మద్దతు తెలిపింది.
మొత్తంగా సభకు వచ్చిన వారిలో 22 మంది వాకౌట్ చేయగా.. మిగిలిన వారు.. 144 మంది విజయ్ ప్రభు త్వానికి మద్దతు ప్రకటించారు. చిత్రం ఏంటంటే.. ఈ మద్దతు తెలిపిన పార్టీల్లో అన్నాడీఎంకే చీలిక వర్గం కూడా ఉంది. వీరిలో 30 మంది షణ్ముగం నేతృత్వంలో పళని స్వామికి వ్యతిరేకంగా.. బయటకు వచ్చి సీఎం విజయ్కు మద్దతు ప్రకటించడం గమనార్హం. దీంతోనే 144 మంది టీవీకే ప్రభుత్వానికి మద్దతు తెలిపినట్టు అయింది.