సంగీతం అంటే చెవి కోసుకునేవారు ఉన్నారు. ఈ క్రమంలో ఒక్కొక్కసారి తమ ఆనందాన్ని పంచుకునే వారు.. అభిమానాన్ని చూపించేవారు.. నోట్లకు పనిచెబుతున్నారు. గతంలో చెన్నైలో ఎం.ఎస్. సుబ్బులక్ష్మి కచేరీ చేసినప్పుడు.. ఆ ఆలపించిన గీతాలకు మంత్రముగ్ధులైన ప్రేకక్షలు..కొందరు తమ ఒంటిపై ఉన్న బంగారాన్ని ఆమెపై వెదజల్లి అభిమానం చాటుకున్నారు. అలానే అమెరికాలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ కచేరీ చేసినప్పుడు.. భారతీయ శాస్త్రీయ సంగీత ఝరిలో మునిగిపోయిన అమెరికన్లు.. డాలర్ల వర్షం కురిపించారు.
ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. అయితే.. తాజాగా గుజరాత్లో జరిగిన ఘటన.. ఇటీవల కాలంలో హైలెట్ అనే చెప్పాలి. గుజరాతీ జానపద సింగర్ గోపాల్ సాధు భజన గీతాలు ఆలపించడంలో ప్రసిద్ధి చెందారు. మన తెలుగులోనూ కొందరు ఉన్నారు. అయితే.. ఆయన ఒకవైపు పాడుతూ.. మరోవైపు.. హార్మోనియంపై అలవోకగా వేళ్లతో నృత్యం చేయిస్తాడు. ఈ సంగీతానికే ప్రేక్షకులు మంత్ర ముగ్ధులవుతారు. తాజాగా అనాగఢ్లోని ఖంబాలియా గ్రామంలో నిర్వహించిన భజన గీతాల్లో సాధు తనదైన శైలిని ప్రదర్శించాడు.
ఆయన గానానికి మంత్ర ముగ్ధులైన కొందరు ప్రేక్షకులు.. నోట్లకురిపించారు. ఇదేదో.. చిన్నా చితకా కార్యక్రమం అనుకుంటే పొరపాటే.. గోనె సంచుల కొద్దీ నోట్లతో సాధును ముంచెత్తారు. ఇంకా అభిమానం తీరని వారు..ఆయన చుట్టూ పడిన నోట్లను ఎత్తి.. మరీ ఆయనపై కుమ్మరించారు. మొత్తంగా సాధు నోట్ల కాయితాల్లో మునిగిపోయే వరకు తమ అభిమానం చాటుకున్నా రు. వీటిలో రూ.10 నుంచి 20, 50, 100, 200 నోట్ల వరకు ఉన్నాయి. ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. సంగీతం పట్ల అభిమానం.. సాధుపట్ల ప్రేమ చూపించిన వారిని అందరూ మెచ్చుకుంటున్నారు.
ఇక, ఈ కార్యక్రమంలో కురిసిన నోట్లను సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తామని నిర్వాహకులు తెలిపారు. అయితే.. సాధుకే ఇచ్చేయాలని కొందరు ప్రేక్షకులు తేల్చి చెప్పారు. సాధుకు ఇది కొత్తకాదని.. పలువురు గుజరాతీలు చెబుతున్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా.. కరెన్సీ నోట్ల వర్షం కురుస్తూనే ఉందని గుర్తు చేస్తున్నారు. ఆయన రూపాయి కూడా తీసుకోరని.. అవన్నీ పేదలకు ఇచ్చేస్తారని అంటున్నారు.