తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2034 తర్వాత.. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని చెప్పారు. ఈలోగా వచ్చే ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీని గెలిపించి.. తానే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పారు. ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానని తెలిపారు. తాజాగా ఆయన మీడియా తో మాట్లాడుతూ.. తన మనసులోని మాటను బయట పెట్టారు. ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో బలమైన నాయకుల అవసరం ఉందన్నారు.
ఈ గ్యాప్ను భర్తీ చేసేందుకు 2034 ఎన్నికల నాటికి తాను జాతీయస్థాయిలో పుంజుకోవాలని భావిస్తున్నట్టు రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యంగా రాహుల్గాంధీని ప్రధానిని చేయడమే తన లక్ష్యమని వ్యాఖ్యానించారు. ఆయన తర్వాత.. స్థానం తనదే అవుతుందని పేర్కొన్నారు. వాస్తవానికి ప్రధాని పదవిపై రాహుల్కు పెద్దగా దృష్టి లేదన్న రేవంత్.. తానే చెప్పి ఒప్పించానని తెలిపారు. దేశంలో కాంగ్రెస్పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తనముందున్న ప్రధాన లక్ష్యమని వివరించారు.
మరో ఐదేళ్లు..
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బట్టి.. వచ్చే 5 సంవత్సరాలు తానే ముఖ్యమంత్రిగా ఉండనున్నారు. 2034 ఎన్నికలకు ముందు 2029లో మరోసారి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం దక్కించుకుని వరుసగా రెండో సారి కూడా ఆయన ముఖ్యమంత్రి అవుతారు. అనంతరం.. కేంద్రంలో చక్రం తిప్పనున్నారు. అయితే.. 43 శాతం ఉన్న బీసీలకు ముఖ్యమంత్రి పదవి దక్కాల్సిన అవసరం ఉందని గతంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ సమయంలో తానే చివరి రెడ్డి ముఖ్యమంత్రిని అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు.కానీ, ఇప్పుడు వచ్చే ఎన్నికల్లోనూ ఆయనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్టు స్పష్టం కావడం గమనార్హం.