వైసీపీ మాజీ ఎమ్మెల్యే, గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గానికి చెందిన బొల్లా బ్రహ్మనాయుడు అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్లోని శేరిలింగంపల్లి పరిధిలో ఉన్న గండిపేట ప్రాంతంలో 9 ఎకరాల 28 కుంటల భూమిని నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేసేందుకు ప్రయత్నించిన విషయంపై ఆయన సహా.. పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. దీనికి సంబంధించిన ఆధారాలను మరిన్నిసేకరించిన పోలీసులు.. మాజీ ఎమ్మెల్యే బొల్లా అరెస్టుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల పరారీలో ఉన్నారని పోలీసులు భావించినా.. ఆయన గుంటూరులోనే ఉన్నారని తెలియడంతో చర్యలు వేగవంతం చేశారు.
ఐపీఎస్ల సంతకాలు ఫోర్జరీ..
నకిలీ పత్రాల సృష్టి వెనుక ఉన్న అనేక చర్యలను పోలీసులు వెలికి తీశారు. నకిలీ జీవో సృష్టించేందుకు ఏకంగా 4 కోట్ల రూపాయ లను లంచంగా ఇచ్చేందుకు బొల్లా బ్రహ్మనాయుడు ప్రయత్నించినట్టు తెలిపారు. అదేసమయంలో భూమిని రెగ్యులరైజ్ చేయా లని.. కోరుతూ.. కలెక్టర్కు ఫైళ్లు పంపించారని.. దీనివెనుక.. కొందరు అధికారులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇప్ప టికే తాము అదుపులోకి తీసుకున్న రాధాకృష్ణ చెప్పిన వివరాల ఆధారంగా.. బొల్లా బ్రహ్మనాయుడిపై కేసు నమోదు చేశామ న్నారు. బొల్లాకు అన్ని విధాలా సహకరించిన రాధాకృష్ణపై ఇప్పటికే 9 కేసులు ఉన్నాయన్నారు. గతంలోనూ భూకబ్జాలకు పాల్పడ్డారని తెలిపారు.
నోరు మెదపని బొల్లా..
కాగా.. హైదరాబాద్లో తనపై కేసు నమోదైన వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు బొల్లా బ్రహ్మనాయుడు నోరు విప్పలేదు. వాస్తవానికి ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు రాజకీయ కుట్ర చేస్తున్నారని సహజంగానే నాయకులు వ్యాఖ్యాని స్తారు. కానీ, ఇక్కడ బొల్లాకు అవకాశం లేదు. ఘటన జరిగింది పొరుగు రాష్ట్రం కావడం.. అక్కడ వైసీపీ పాత్ర లేక పోవడం.. పైగా తనకు ప్రత్యర్థులు ఎవరూ అక్కడ లేని నేపథ్యంలో బొల్లా ఎలాంటి రాజకీయ విమర్శలు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. అయితే.. పోలీసులు తమ చర్యలను వేగవంతం చేయడంతో ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తున్నట్టు బొల్లా అనుచరులు చెప్పారు.
వైసీపీ మౌనం..
మరోవైపు కీలక నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు భూకబ్జా వ్యవహారంపై వైసీపీ కూడా మౌనంగానే ఉండి పోయింది. ఎక్కడా ఎవరూ మాట్లాడవద్దని పార్టీ నిర్దేశించినట్టు సమాచారం. దీంతో బొల్లా వ్యవహారంపై ఎవరూ మాట్లాడలేదు. మరోవైపు.. బొల్లా వ్యవహారం.. ఆయన చేసిన భూకబ్జాల వ్యవహారం తెరమీదికి రావడంతో ఏపీ ప్రభుత్వం కూడా అలెర్ట్ అయింది. వినుకొండ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో ఆయన గెలిచిన తర్వాత.. జరిగిన అక్రమాలపై ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ఇక్కడ కూడా కబ్జాలు చేశారన్న ఆరోపణలు ఉండడంతో తేడా వస్తే.. విచారణ చేయాలని నిర్ణయించుకునట్టు సమాచారం.